Karn Sharma Retirement: భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల కర్ణ్ శర్మ అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. యూపీ టీ20 లీగ్లో కాన్పూర్ సూపర్స్టార్స్ తరఫున ఆడుతున్న ఆయన.. ఆగస్టు 25న మీరట్ మావెరిక్స్తో జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ అని వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన కర్ణ్ శర్మ.. తన క్రికెట్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, బీసీసీఐ, రైల్వేస్, యూపీసీఏ, ఆంధ్ర, విదర్భ క్రికెట్ అసోసియేషన్తో పాటు అభిమానులు, సహచరులు, కోచ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై కోచింగ్తో పాటు క్రికెట్కు సంబంధించిన ఇతర బాధ్యతలు చేపట్టేందుకు తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు.
కర్ణ్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ఎక్కువ కాలం సాగకపోయినా.. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాడు. 2014లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో జో రూట్ వికెట్ను పడగొట్టి.. తన ఏకైక టీ20 అంతర్జాతీయ వికెట్ను సాధించాడు. ఆ తర్వాత శ్రీలంక పర్యటనలో వన్డే అరంగేట్రం చేశాడు. కోల్కతాలో జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ 264 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కర్ణ్ శర్మ ఆ సిరీస్లో రెండు వన్డేలు ఆడినా వికెట్ సాధించలేకపోయాడు. అదే ఏడాది ఆస్ట్రేలియాతో అడిలైడ్లో జరిగిన టెస్టుతో టెస్ట్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు. తన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ల్లో రెండేసి వికెట్లు తీసి మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున ఒక టెస్టు, రెండు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు.
కర్ణ్ శర్మ 2007-08 సీజన్లో ఫస్ట్క్లాస్, లిస్ట్-ఎ, టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. లెగ్ స్పిన్నర్గా గుర్తింపు పొందిన ఆయన.. లోయర్ ఆర్డర్లో బ్యాట్తోనూ మంచి ప్రదర్శనలు చేశాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని కూడా చాటుకున్నాడు. 2012-13 సీజన్ కర్ణ్ శర్మ కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. కేవలం మూడు రంజీ మ్యాచ్ల్లోనే 21 వికెట్లు పడగొట్టి 19.04 సగటుతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శనకు బీసీసీఐ బెస్ట్ అండర్-25 క్రికెటర్ అవార్డును అందుకున్నాడు. అదే సమయంలో అతడి ప్రతిభపై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది.
కర్ణ్ శర్మ ఐపీఎల్లో నాలుగు టైటిళ్లు గెలుచుకున్నాడు. అంతేకాదు మూడు వేర్వేరు ఫ్రాంచైజీలతో వరుసగా మూడు సీజన్లలో టైటిళ్లు సాధించిన తొలి ఆటగాడిగా ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలిచిన కర్ణ్ శర్మ.. 2017లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. అనంతరం 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున టైటిల్ గెలిచాడు. 2021లో మరోసారి సీఎస్కే టైటిల్ విజయంలో భాగమై.. నాలుగో ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నాడు.
కర్ణ్ శర్మ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 90 ఐపీఎల్ మ్యాచ్ల్లో 83 వికెట్లు సాధించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో కర్ణ్ శర్మ 97 మ్యాచ్లు ఆడి 270 వికెట్లు తీశాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. బ్యాటింగ్లో 2,866 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 17 అర్ధసెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్లో 123 మ్యాచ్లు ఆడి 153 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్లో 191 మ్యాచ్ల్లో 168 వికెట్లు సాధించాడు. సుదీర్ఘ కాలం దేశవాళీ క్రికెట్లో కొనసాగుతూ తన అనుభవంతో యువ బౌలర్లకు స్ఫూర్తిగా నిలిచాడు.
క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ ఆటకు పూర్తిగా దూరం కానని కర్ణ్ శర్మ చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్తో పాటు క్రికెట్కు సంబంధించిన ఇతర బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ కాలం ఆడలేకపోయినా.. ఐపీఎల్లో నాలుగు టైటిళ్లు, దేశవాళీ క్రికెట్లో వందలాది వికెట్లతో కర్ణ్ శర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆగస్టు 25న జరిగే చివరి మ్యాచ్తో అతడి ప్రొఫెషనల్ క్రికెట్ ప్రయాణానికి తెరపడనుంది.

