Team India: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్.. సీనియర్ ఆటగాళ్లపై వేటు?

Ishan Kishan

Ishan Kishan

Team India: టీమిండియా యువ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమీకరణాలన్నీ మార్చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేయడంతో బీసీసీఐ దృష్టిలో కూడా పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2023-24కు సంబంధించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోనున్నాడు. ఈనెల 21న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ఖరారు చేయనున్నారు. కొన్నాళ్లుగా టీమిండియా తరఫున ఆడుతున్నా ఇషాన్ కిషన్‌కు సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. కానీ ఇప్పుడు అతడికి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడికి బి లేదా సి కాంట్రాక్టు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు సెంట్రల్ కాంట్రాక్టులో సీనియర్ ఆటగాళ్లపై బీసీసీఐ వేటు వేయనుంది. కేవలం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే ఆడుతూ పేలవ ప్రదర్శనతో జట్టుకు దూరమైన ఆజింక్యా రహానె, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ కాంట్రాక్టులను బీసీసీఐ తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే వీరి కెరీర్‌కు శుభం కార్డు పడగా త్వరలో సెంట్రల్ కాంట్రాక్టులకు కూడా బీసీసీఐ ఎండ్ కార్డ్ వేయనుంది. వీరి స్థానంలో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రహానే, ఇషాంత్ శర్మ గ్రేడ్-బిలో ఉండగా.. వృద్ధిమాన్ సాహా గ్రేడ్-సిలో ఉన్నాడు.

Read Also: Umbrella Controversy: సీఎం స్టాలిన్ సతీమణికి దేవుని గొడుగు …వివాదం అవుతున్న వ్యవహారం

సూర్యకుమార్, శుభమన్ గిల్ ప్రస్తుతం గ్రేడ్-సిలో ఉండగా వీరికి ప్రమోషన్ దక్కనుంది. హార్దిక్ పాండ్యా కూడా గ్రేడ్-సిలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత పాండ్యా అద్భుత ఆటతో మెప్పిస్తున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించడంతో పాటు ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లో రాణించాడు. టీ20లకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు త్వరలోనే రెగ్యులర్ కెప్టెన్ కానున్నాడు.