భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ప్రతిభ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజూ.. అవకాశాలు వచ్చిన ప్రతిసారి వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం టీ20 వరల్డ్ కప్ 2026 ముందు న్యూజీలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడమే. 5 మ్యాచ్ల్లో వరుసగా 10, 6, 0, 24, 6 స్కోర్లు చేశాడు. 9.2 సగటుతో 46 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శనతో ప్రపంచకప్లో చోటు దక్కడం కష్టమే.
వరుసగా మారిన కోచింగ్ ఎరాల్లోనూ సంజూ శాంసన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. రవిశాస్త్రి కోచ్గా ఉన్న సమయంలో సంజూకు సరైన స్థిరత్వం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ యుగంలోనూ అవకాశాలు పొందినప్పటికీ.. కీలక మ్యాచ్ల్లో నిలకడగా రాణించలేకపోయాడనే అభిప్రాయం ఏర్పడింది. తాజాగా గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలోనూ అతడి ప్రదర్శన మెరుగుపడకపోవడం విమర్శలకు మరింత బలం చేకూర్చింది. సంజూ ప్రదర్శన అభిమానులు, విశ్లేషకుల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతోంది. వచ్చిన అవకాశాలను చేతులారా వృథా చేసుకున్నాడు? అనే అభిప్రాయాన్ని ఫాన్స్ అంటున్నారు.
Also Read: Ishan Kishan Century: టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎలైట్ లిస్ట్లో ఇషాన్ కిషన్!
సంజూ శాంసన్ ప్రదర్శన టీ20 వరల్డ్ కప్ 2026పై కూడా ప్రభావం పడుతోంది. ప్రస్తుత ఫామ్, జట్టు కాంబినేషన్ను దృష్టిలో ఉంచుకుంటే.. సంజూను టీ20 వరల్డ్ కప్ 2026 ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. యువ ఆటగాళ్లు, ఫామ్లో ఉన్న బ్యాటర్లకు అవకాశాలు ఇవ్వాలని నెటిజెన్స్ అంటున్నారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ, సెంచరీతో సత్తాచాటాడు. దాంతో టీ20 వరల్డ్కప్లో ఓపెనర్గా కిషన్ ఆడడం దాదాపుగా ఖాయం అయింది. సంజూ ఇక బెంచ్కే పరిమితం కానున్నాడు. వరల్డ్కప్ అనంతరం అతడు జట్టుకు ఎంపిక కాకపోవచ్చు. మొత్తానికి సంజూ టీ20 కెరీర్ ముగిసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో అతడి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
