Yash Dayal opened up on missing IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకెళుతోంది. లీగ్ దశలో 9 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నేడు క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో తలపడనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ ఆడని విషయం తెలిసిందే. ఎట్టకేలకు తన గైర్హాజరుపై దయాల్ స్పందించాడు. వ్యక్తిగత పరిస్థితుల కారణంగా దయాల్ ఈ సీజన్కు దూరంగా ఉంటాడని ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దయాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
‘టాక్ విత్ మన్వేంద్ర’ పోడ్కాస్ట్లో మాట్లాడిన యశ్ దయాల్.. ఈ సీజన్కు దూరంగా ఉండటం తన వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. ‘ఆర్సీబీ మ్యాచ్లు టీవీలో చూస్తుంటే.. చాలా మిస్ అవుతున్నాను. కొన్నిసార్లు వెంటనే లేచి మైదానంలోకి వెళ్లాలనిపిస్తుంది. కానీ అది సాధ్యం కాదు. ఆర్సీబీ ఇప్పటికీ నన్ను జట్టులో భాగంగానే చూస్తోంది. నన్ను రిటైన్ చేసింది, నా స్థానంలో మరొకరిని తీసుకోలేదు. అంటే నేను ముఖ్యమైన ఆటగాడిననే భావన జట్టులో ఉంది. ఈ సీజన్ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత నిర్ణయం కాదు. అసలు నిర్ణయాలు అధికారుల చేతుల్లోనే ఉంటాయి. ఆర్సీబీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో నాకు పూర్తిగా తెలియదు. నేను జట్టును చాలా మిస్ అవుతున్నాను. జట్టు నన్ను మిస్ అవుతోందో లేదో అభిమానులే చెప్పాలి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ ఆర్సీబీ మేనేజ్మెంట్తో నిరంతరం టచ్లోనే ఉన్నానని యశ్ దయాల్ తెలిపాడు. ‘ఆర్సీబీ డైరెక్టర్తో, కోచ్ దినేశ్ కార్తీక్తో తరచూ మాట్లాడుతున్నాను. మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. అన్నీ క్లియర్గానే ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు. దయాల్ తనపై ఉన్న కేసుల కారణంగానే క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అతడిపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసులో వివాహం పేరుతో ఓ మహిళను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు గాజియాబాద్లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 కింద నమోదు చేశారు.
ఇక మరో కేసులో జైపూర్లోని సంగానేర్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. క్రికెట్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి యశ్ దయాల్ ఓ మైనర్ బాలికపై రెండేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు 17 ఏళ్ల వయసులో ఉండగానే ఈ ఘటనలు ప్రారంభమైనట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల కారణంగానే ఆర్సీబీ మేనేజ్మెంట్ అతడిని పక్కనపెట్టింది.
