టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాయ్పుర్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ కోహ్లీ సెంచరీ చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 105 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. విరాట్ ఇప్పటివరకు 21 అవార్డులు అందుకున్నాడు.
ఐపీఎల్లో అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న ఆటగాడిగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ ఇప్పటివరకు 21 అవార్డులు గెలుచుకున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ 21 అవార్డులతో రోహిత్ సరసన చేరాడు. గత 18 ఏళ్లుగా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనలు చేస్తున్న కింగ్.. అనేక మ్యాచ్ల్లో ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందించాడు. ముఖ్యంగా ఛేజింగ్లో విరాట్ బ్యాటింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ‘మిస్టర్ కూల్’ ఇప్పటివరకు 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఫినిషర్గా, కెప్టెన్గా సీఎస్కే విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు.
నాలుగో స్థానంలో ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెరో 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో కొనసాగుతున్నారు. జడేజా బ్యాట్, బాల్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఎన్నో మ్యాచుల్లో హీరోగా నిలిచాడు. మరోవైపు రాహుల్ తన క్లాసిక్ బ్యాటింగ్తో ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శనలు ఇస్తూ ఈ జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో చివరిగా యూసుఫ్ పఠాన్ ఉన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యూసుఫ్.. 16 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ తొలి దశలో అత్యంత ప్రమాదకర భారత బ్యాటర్లలో యూసుఫ్ ఒకడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కేవలం వ్యక్తిగత ప్రతిభకే కాదు.. మ్యాచ్ పరిస్థితుల్లో జట్టును విజయపథంలో నడిపించే సామర్థ్యానికి గుర్తింపుగా భావిస్తారు. ఈ జాబితాలో ఉన్న భారత ఆటగాళ్లు తమ అద్భుత కెరీర్తో ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.
