ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగత సీజన్ అనగానే.. అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ‘కింగ్’ విరాట్ కోహ్లీ పేరే. 2016 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ ఆడిన బ్యాటింగ్ ఇప్పటికీ అభిమానుల మదిలో చెరగని ముద్రగా నిలిచింది. నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలతో 973 పరుగులు చేసి.. టోర్నీ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. దూకుడు, నిలకడైన ప్రదర్శనతో కోహ్లీ సృష్టించిన ఆ రికార్డు ఇప్పటికీ అజేయంగా ఉంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2026లో ఆ రేర్ రికార్డుకు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ముప్పుగా మారాడు.
15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ఊచకోత కోస్తున్న వైభవ్.. ఐపీఎల్ 2026లో తన విధ్వంసక బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై 29 బంతుల్లో 97 పరుగులు బాది మరోసారి తన సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్తో ఈ సీజన్లో అతడి పరుగుల సంఖ్య 680కి చేరింది. కేవలం రెండో ఐపీఎల్ సీజన్లోనే ఇన్ని రన్స్ చేయడం మామలు విషయం కాదు. ముఖ్యంగా అతడి స్ట్రైక్రేట్ 242.85 ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇంత భారీ స్ట్రైక్రేట్తో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు ఇప్పటివరకు లేడు.
వైభవ్ బ్యాటింగ్లో ఎలాంటి బెరుకు కనిపించడం లేదు. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్లో తొలి బంతినే సిక్సర్గా మలచడం అతడి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఈ వయసులో ఇంత దూకుడుగా బ్యాటింగ్ చేయడం చాలా అరుదు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టైటిల్కు మరో రెండు విజయాల దూరంలో ఉంది. 2008 తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని చూస్తున్న ఆర్ఆర్కు వైభవ్ ప్రధాన బలంగా మారాడు.
ఐపీఎల్ చరిత్రలో గొప్ప వ్యక్తిగత సీజన్లలో విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు దిగ్గజాలు కూడా ఉన్నారు. క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, జోస్ బట్లర్ తమ ఆటతో ప్రత్యేకంగా నిలిచారు. 2011లో గేల్ 608 పరుగులతో టీ20 క్రికెట్కు సరికొత్త నిర్వచనం చెప్పాడు. ఆ తర్వాతి రెండేళ్లలో కూడా 700కు పైగా పరుగులు చేసి ఆధిపత్యం చాటాడు. రస్సెల్ 2019లో 510 పరుగులు, 11 వికెట్లతో అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. సునీల్ నరైన్ 2024లో బ్యాట్ (488 రన్స్), బాల్ (17 వికెట్స్)తో అదరగొట్టి.. కేకేఆర్కు టైటిల్ అందించాడు. జోస్ బట్లర్ 2022లో నాలుగు సెంచరీలతో 863 పరుగులు బాదాడు.
అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ చేస్తున్న విధ్వంసం చూస్తుంటే.. ఈ సీజన్ను కూడా ఐపీఎల్ చరిత్రలో గొప్ప వ్యక్తిగత సీజన్ల జాబితాలో చేరేలా ఉంది. ముఖ్యంగా అతడి వయసు, ఆడుతున్న దూకుడు, జట్టుపై చూపుతున్న ప్రభావం ఈ సీజన్ను మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. ఒకవేళ రాజస్థాన్ టైటిల్ గెలిచి వైభవ్ ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ అవార్డు కూడా దక్కించుకుంటే.. విరాట్ కోహ్లీ 2016 సీజన్కు మించి పోనుంది. విరాట్ పరుగుల రికార్డును అందుకోవాలంటే.. ఇంకా 300 రన్స్ అవసరం. ఇది అసాధ్యమనే చెప్పాలి. అయితే అత్యంత ప్రభావవంతమైన సీజన్లలో ఒకటిగా 2026 నిలవనుందని మాత్రం చెప్పొచ్చు.
