ఐపీఎల్ 2026 సీజన్తో భారత క్రికెట్లో కొత్త సంచలనంగా అవతరించిన వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మైదానానికే పరిమితం కాలేదు. తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు.. ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్ ప్రపంచంలోనూ హాట్ ప్రాపర్టీగా మారాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత వైభవ్ బ్రాండ్ విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026లో ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. 237.30 స్ట్రైక్రేట్తో బౌలర్లపై విరుచుకుపడిన బుడ్డోడు.. ఆరెంజ్ క్యాప్తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ప్రస్తుతం రాయల్స్తో వైభవ్కు ఏడాదికి రూ.1.10 కోట్ల ఒప్పందం ఉంది. అయితే అతని ఐపీఎల్ జీతం పెరిగేందుకు ఇంకా కొంత సమయం పట్టొచ్చు. కానీ బ్రాండ్ ఎండార్స్మెంట్ మార్కెట్లో మాత్రం అతని డిమాండ్ ఇప్పటికే భారీగా పెరిగిపోయింది.
తెలిసిన సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వైభవ్ సూర్యవంశీ ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి దాదాపు రూ.1 కోటి తీసుకున్నాడు. ఇప్పుడు ఒక్కో డీల్కు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. వైభవ్ ఇప్పటికే ప్రముఖ బ్రాండ్లు అయిన కాంప్లాన్, రెడ్ బుల్ ప్రకటనల్లో కనిపించాడు. ఐపీఎల్లో అతని అద్భుత ప్రదర్శన తర్వాత మరెన్నో కంపెనీలు అతనితో ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం అతని బ్రాండ్ పోర్ట్ఫోలియోను కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా ఈ విషయంలో సహకరిస్తున్నట్లు సమాచారం.
వైభవ్ కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ వయసులోనే వచ్చిన అపారమైన గుర్తింపు, భారీ ఆర్థిక అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. అతని ప్రతిభను చూసి ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అతడిని సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలతో పోలుస్తున్నారు. అయితే ప్రతిభ ఎంత ఉన్నా.. అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా రాణించడం, అన్ని ఫార్మాట్లలో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం వైభవ్ భారత క్రికెట్లో అత్యంత విలువైన యువ బ్రాండ్గా ఎదుగుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
