Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్‌కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!

  • భారత క్రికెట్‌లో సంచలనంగా వైభవ్ సూర్యవంశీ
  • బుడ్డోడిని ఆకాశానికి ఎత్తేసిన ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్
  • బిహార్‌కు వైభవ్ సూర్యవంశీ వల్లే గుర్తింపు
Ridhima Pathak Vaibhav Dhoni

Ridhima Pathak Vaibhav Dhoni

Ridhima Pathak Hails Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. కేవలం క్రీడా ప్రపంచానికే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా బుడ్డోడు చర్చనీయాంశంగా మారాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ రిధిమా పాఠక్ కూడా బుడ్డోడిని ఆకాశానికి ఎత్తేసింది. తన స్వరాష్ట్రం బీహార్‌కు వైభవ్ కొత్త గుర్తింపును తీసుకొచ్చాడంటూ రిధిమా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో రిధిమా పాఠక్ మాట్లాడుతూ… వైభవ్ సూర్యవంశీ బీహార్‌కు మంచి ప్రచారాన్ని అందించాడని పేర్కొన్నారు. గతంలో బీహార్‌కు చెందినవారమని చెప్పేందుకు చాలా మంది సంకోచించేవారని, రాష్ట్రానికి మంచి పేరు లేకపోవడమే అందుకు కారణమని ఆమె అన్నారు. ‘చిన్నప్పుడు స్కూల్ లేదా కాలేజీలో మీరు ఎక్కడి వారు అని అడిగితే బీహార్ నుంచి వచ్చామని చెప్పడానికి మేము కొంత సంకోచించేవాళ్లం. కానీ తర్వాత రెండు గొప్ప విషయాలు జరిగాయి. మొదటిది మహేంద్ర సింగ్ ధోనీ, రెండోది గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా. ఈ రెండూ బీహారీల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అయితే ఆ గుర్తింపు మొత్తం జార్ఖండ్‌కు వెళ్లిపోయింది. ఎందుకంటే బీహార్ నుంచి విడిపోయిన కొత్త రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది’ అని రిధిమా చెప్పారు.

×
×
Ad

ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ రూపంలో బీహార్‌కు అసలైన ప్రతినిధి లభించాడని రిధిమా పాఠక్ అభిప్రాయపడ్డారు. ‘వైభవ్ సూర్యవంశీ పూర్తిగా బీహార్‌కు చెందిన కుర్రాడు. ఇప్పుడు ఏ బీహారీ అయినా తాను బీహార్‌కు చెందినవాడినని గర్వంగా చెబుతాడు. బీహార్‌కు సరైన గుర్తింపు, ప్రచారం వైభవ్ ద్వారానే వచ్చింది’ అని ఆమె అన్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) అందుకోవడంతో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (ఎంవీపీ) అవార్డును కూడా గెలుచుకున్నాడు.

ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 776 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ 237.30గా నమోదవడం విశేషం. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లపై కూడా ధాటిగా ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న బుడ్డోడు.. త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించనున్నాడు.