ఐపీఎల్ 2026లో మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్కు టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపించింది. భారీ లక్ష్యం 223 పరుగులు ఛేజ్ చేస్తూ.. ఆర్ఆర్ ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 3×6) అసాధారణ ఇన్నింగ్స్తో హీరోగా నిలిచాడు. షిమ్రోన్ హెట్మైర్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ఫెరీరా.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా వినియోగించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో పంజాబ్ పేసర్లు అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గుసన్లపై విరుచుకుపడి మ్యాచ్ను పూర్తిగా మలుపుతిప్పాడు.
భారీ ఛేజ్లో చివరి 6 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 71 పరుగులు అవసరమైన సమయంలో డొనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే (31 నాటౌట్) కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ కలసి 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాది పంజాబ్ కింగ్స్ టాప్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మధ్యలో యుజ్వేంద్ర చాహల్ (3/36) కీలక వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పినా.. చివర్లో ఫెరీరా, దూబే జోడి విజయం దిశగా తీసుకెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్కు డొనోవన్ ఫెరీరా క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియోను రాజస్థాన్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
బాలీవుడ్ నటి ప్రీతి జింటా సహ యజమానిగా ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2014 క్వాలిఫయర్-1లో కోల్కతా నైట్ రైడర్స్ను ఢీకొంది. ఆ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. ‘ప్రీతి టీమ్ గెలిచిందా?’ అని ఎక్స్లో సల్మాన్ ఖాన్ పోస్ట్ పెట్టారు. పంజాబ్ మ్యాచ్ జరిగినప్పుడల్లా సల్మాన్ పాత ట్వీట్ తెరపైకి వస్తుంది. ఇప్పుడు కూడా సల్మాన్ పోస్టుకు ఫెరీరా సరదాగా స్పందించాడు. ‘సారీ భాయ్.. ఈ రోజు కాదు’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
