‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్తో తన ప్రయాణాన్ని ప్రారంభించి.. నేటికి 15 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. 2008 నుంచి 2010 వరకు అప్పటి డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. 2011లో ముంబైలోకి వచ్చాడు. 2011 ఏప్రిల్ 10న ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి ఇన్నేళ్లు ముంబైలోనే ఉన్నాడు. నేటికి ముంబైలో చేరి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా రోహిత్ అభిమానులు ప్రత్యక పోస్టులు పెడుతున్నారు. ఈ 15 ఏళ్లలో హిట్మ్యాన్ ముంబై జట్టుకు అత్యంత కీలక ఆటగాడిగా నిలిచాడు. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాయిలు అందుకున్నాడు.
ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ప్రదర్శన అసాధారణం అనే చెప్పాలి. హిట్మ్యాన్ ముంబై తరఫున 230కి పైగా మ్యాచ్లు ఆడి దాదాపు 6,000 పరుగులు చేశాడు. ముంబై జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. ముంబై తరఫున అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు 15 కంటే ఎక్కువ సీజన్లు ఆడిన ఏకైక ఆటగాడిగా కూడా మరో ఘనత అందుకున్నాడు.
కెప్టెన్గా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా 5 టైటిల్స్ గెలిచిన ఘనత అతడి సొంతం. హిట్మ్యాన్ నాయకత్వంలో ముంబై ఎన్నో కీలక మ్యాచ్లలో విజయాలు సాధించింది. ముంబై ఇండియన్స్ను ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా మార్చడంలో రోహిత్ పాత్ర ఎంతో కీలకం. కేవలం రన్స్ మాత్రమే కాకుండా.. తన ప్రశాంత నాయకత్వం, మ్యాచ్ను అర్థం చేసుకునే తీరు, యువ ఆటగాళ్లను ప్రోత్సహించే శైలి ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకున్నాడు. 15 ఏళ్ల ఈ ప్రయాణం అతని కృషి, ప్రతిభ, నిబద్ధతకు నిదర్శనం. రోహిత్ లెగసీ ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
