Riyan Parag Hails Archer and Deshpande: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్పై సాధించిన ఉత్కంఠ భరిత విజయంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. మ్యాచ్ ఒక దశలో తమ చేతిలో నుంచి జారిపోతుందని అనిపించిందని, కానీ చివరి ఓవర్లలో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విజయం సాధించగలిగామని తెలిపాడు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండేలు దేవుడిలా వచ్చి కాపాడారని పరాగ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో బౌలర్లే హీరోలు అని రాయల్స్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. టైటాన్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆర్చర్, తుషార్ చెరో 4 పరుగులే ఇచ్చి రాజస్థాన్కు ఊహించని విజయాన్ని అందించారు.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ… ‘ఇది నిజంగా అద్భుతంగా అనిపించింది. ఒక దశలో నేను రిస్క్ తీసుకుందామని భావించాను. మా ఆటగాళ్లు ప్లాన్ను అద్భుతంగా అమలు చేశారు. నా గొంతు కూడా మారిపోయేంతగా నేను అరిచాను. ప్లేయర్స్ నేను అనుకున్న విధంగా ఆడినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. 19వ, 20వ ఓవర్లలో ఎవరు బౌలింగ్ చేయాలన్న విషయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నా. ఆ సమయంలో 12 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. దూకుడుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాను. అది సక్సెస్ అయితే బాగుంటుంది, లేదంటే తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాం అనుకున్నాను. అయితే ధృవ్ జురెల్ వచ్చి అంతా సెట్ చేశాడు. 19వ ఓవర్ను ఆర్చర్కు ఇవ్వాలని సూచించాడు. అది సక్సెస్ అయింది’ అని చెప్పాడు.
Also Read: Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!
‘ధృవ్ జురెల్ ప్రతిభకు ఇప్పటివరకు పూర్తిగా న్యాయం జరగలేదని నాకు అనిపిస్తుంది. అతను 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ కష్టమైన పాత్ర పోషించాడు. కానీ ఈసారి మూడో స్థానంలో అవకాశం ఇచ్చినప్పుడు తన సత్తా నిరూపించుకున్నాడు. అతను జురెల్ 700-800 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాలని ఆశిస్తున్నాను. వరుసగా రెండు మ్యాచ్లు గెలవడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో పూర్తి క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. ఈ రోజు విజయాన్ని బాగా జరుపుకుంటాం. కానీ రేపు ఉదయం నుంచి తర్వాతి మ్యాచ్పై దృష్టి పెట్టాలి. ముంబైపై ఎలా ఆడాలో ప్లాన్ చేస్తాం. ఈసారి గట్టిగా కొడతాం’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.