ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అనూహ్యంగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది. సీజన్ ప్రారంభంలో తొలి ఏడు మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లిన పీబీకేఎస్.. ఇప్పుడు వరుస ఓటములు చవిచూసి ప్లేఆఫ్స్ రేసులో వనకపడిపోయింది. నాలుగు ఓటములు ఎదురయినప్పటికీ పంజాబ్ ఇంకా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్లలో రెండు విజయాలు సాధిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. వరుస పరాజయాల నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. టెన్షన్ వద్దని, తప్పకుండా ప్లేఆఫ్స్కు చేరుతాం అని ధీమా వ్యక్తం చేశాడు.
ఇన్స్టాగ్రామ్లో పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన వీడియోలో ప్రభ్సిమ్రాన్ సింగ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ‘మేము వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయాం. కానీ ఇప్పటికీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నాం. మేము ఖచ్చితంగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించి ట్రోఫీ గెలుస్తాం. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ధర్మశాలను రెడ్ కలర్తో నింపేయండి. ముంబై ఇండియన్స్తో జరిగే తదుపరి మ్యాచ్ మాకు చాలా కీలకం. ఆ మ్యాచ్ గెలిచి మళ్లీ కంబ్యాక్ చేస్తాం’ అని ప్రభ్సిమ్రాన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సీజన్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరఫున అద్బుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 382 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే గత మూడు మ్యాచ్ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్పై15 పరుగులు, సన్రైజర్స్ హైదరాబాద్పై 3 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్పై 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్ జట్టుకు సరైన ఆరంభాలు లేకుండా పోయాయి.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 4 ఓటములు, ఒక నో రిజల్ట్తో మొత్తం 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా పట్టికలో పంజాబ్ జట్టుకు చాలా దగ్గరగా ఉండటంతో ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారింది. తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోతే.. పంజాబ్ టాప్-4 నుంచి బయటకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతో జరగబోయే మ్యాచ్ పంజాబ్ కింగ్స్కు కీలకంగా మారింది. వరుస పరాజయాల తర్వాత జట్టు ఎలా కంబ్యాక్ చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
