Is MS Dhoni To Play Last IPL Match for CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగింపుకు చేరుకుంటున్న సమయంలో క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ పెరిగింది. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఇంకా రెండు లీగ్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా.. ధోనీ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సీజన్ అనంతరం మహీ ఐపీఎల్కు గుడ్బై చెబుతాడని జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. చెన్నై అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన చెపాక్ స్టేడియంలో ధోనీ తన చివరి మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
హామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఐపీఎల్ 2026లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు మైదనంలోకి దిగలేదు. గత సీజన్లో ఎదురైన మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్గా ఉన్నప్పటికీ.. మహీ ఇంకా మైదానంలోకి దిగకపోవడం అభిమానుల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. మే 15న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ ఆడతాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ వరుసగా మూడు విజయాలతో అప్పటివరకు ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్టు విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదనే ఉద్దేశంతోనే తలా బరిలోకి దిగలేదని తెలుస్తోంది. అయితే ఆ మ్యాచ్లో లక్నో చేతిలో చెన్నై ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ప్లేఆఫ్స్ రేసు మరింత సంక్లిష్టంగా మారింది.
ఇక చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 18న సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ ఆడనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఇదే మాహీకి చివరి మ్యాచ్ అని కూడా అంటున్నారు. ధోనీ రిటైర్మెంట్ కోసం సీఎస్కే మేనేజ్మెంట్ చెపాక్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మే 18న ధోనీ సడన్ ఎంట్రీ ఇవ్వొచ్చని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. క్రిక్బజ్ చర్చలో పాల్గొన్న భోగ్లే మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026లో చెన్నైలో సీఎస్కేకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ మ్యాచ్ మే 18న జరగనుంది. ఆ రోజు మొత్తం చెన్నై నగరం పసుపు రంగులో కళకళలాడినా ఆశ్చర్యపోను. హిచ్కాక్ స్టైల్లో అయినా ధోనీ ఒక్కసారిగా కనిపించినా ఆశ్చర్యం లేదు’ అని వ్యాఖ్యానించాడు.
హర్షా భోగ్లే చేసిన హిచ్కాక్ అపియరెన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధోనీ అకస్మాత్తుగా మైదానంలోకి వస్తే అభిమానులకు అది భారీ సర్ప్రైజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ధోనీ రిటైర్మెంట్పై ఇప్పటివరకు అటు సీఎస్కే నుంచి కానీ.. ఇటు మహీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏదేమైనా ఇప్పుడు సీఎస్కే అభిమానుల దృష్టంతా మే 18 మ్యాచ్పైనే ఉంది. ధోనీ నిజంగా మైదానంలో కనిపిస్తాడా? లేదా? అన్న ఆసక్తి మరింత పెరిగింది.
