MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!

  • చెపాక్ మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన చెన్నై
  • ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై జోరుగా చర్చలు
  • ప్రపంచ క్రికెట్‌ను మార్చిన దిగ్గజం ధోనీ
Ms Dhoni Fan Craze

Ms Dhoni Fan Craze

MS Dhoni Craze Leaves Mark Boucher Amazed: ఐపీఎల్‌ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. చెన్నై ఇంటికి వెళ్లాల్సిందే. ఈ సీజన్‌లో ఇప్పటికే చెన్నై చెపాక్ మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ధోనీ రిటైర్మెంట్‌పై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇది అతడి చివరి సీజన్ కావచ్చని అభిమానులు, క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌కీపర్ మార్క్ బౌచర్ ధోనీపై చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఏళ్ల పాటు ధోనీకి ప్రత్యర్థిగా నిలిచిన బౌచర్.. మహీని ప్రపంచ క్రికెట్‌ను మార్చిన దిగ్గజంగా అభివర్ణించాడు.

తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన మార్క్ బౌచర్.. చెపాక్ స్టేడియంలో ఎంఎస్ ధోనీకి దక్కే అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘నేను చెపాక్‌కు చాలాసార్లు వచ్చాను. ధోనీపై అభిమానులు చూపించే పిచ్చి ప్రేమ అద్భుతం. ఆ క్రేజ్ మరో ఆటగాడికి లేదు. దక్షిణాఫ్రికాలో కూడా నేను ఇదే విషయం చెబుతుంటాను. ఎవరికైనా ఐపీఎల్ అనుభవం కావాలంటే.. చెపాక్‌లో ధోనీ ఆడే మ్యాచ్ తప్పకుండా చూడాలని చెబుతాను. అప్పుడే అతడు ఎంత పెద్ద వ్యక్తో అర్థమవుతుంది. ధోనీ కేవలం భారతదేశానికే కాదు.. ప్రపంచ క్రికెట్‌కే లెజెండ్‌. అతడు ఆట కోసం చేసిన సేవలు అద్భుతం. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అది క్రికెట్‌కు చాలా పెద్ద నష్టం’ అని బౌచర్ పేర్కొన్నాడు.

‘భవిష్యత్తులో సీఎస్కే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా లేదా మరో కీలక పాత్రలో అయినా క్రికెట్‌తో ఎంఎస్ ధోనీ అనుబంధం కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను. ధోనీకి అసాధారణమైన క్రికెట్ మైండ్ ఉంది. అతడు ఎప్పటికీ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగానే గుర్తుండిపోతాడు. ప్రపంచ క్రికెట్ తరఫున ధోనీకి థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఈ ఆట కోసం చేసిన ప్రతిదానికి ధన్యవాదాలు’ అని బౌచర్ భావోద్వేగంగా చెప్పాడు. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించిన ఎస్‌ఆర్‌హెచ్.. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిసి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. మధ్యలో వరుస ఓటములతో చెన్నై ప్లేఆఫ్స్‌ ఆశలు దాదాపుగా వదిలేసుకుంది.