IPL 2027: పాకిస్థాన్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చర్చల్లో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్లో ఆడాలన్న తన కోరికను గతంలోనే పలుమార్లు వ్యక్తం చేసిన అమీర్.. తాజాగా మరోసారి ఐపీఎల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత అతనికి ఐపీఎల్లో ఆడే అవకాశాలపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీ సందర్భంగా మాట్లాడిన మహమ్మద్ అమీర్.. ఐపీఎల్లో ఆడటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. 2027 నుంచి తాను పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో విదేశీ ఆటగాడిగా ఆడతానని, అయితే ఐపీఎల్లో పాల్గొంటానా లేదా అన్న విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని వెల్లడించాడు. అయితే, భారత్–పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో 2008 తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐపీఎల్లో అవకాశం లేకుండా పోయింది. అయితే, బ్రిటిష్ పౌరురాలైన తన భార్య నర్గీస్ ఖాన్ ద్వారా మహమ్మద్ అమీర్ బ్రిటిష్ పౌరసత్వం పొందడంతో పరిస్థితులు కొంత మారాయి. ఇప్పుడు అతను బ్రిటిష్ ఆటగాడిగా ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకునే అవకాశముంది.
గతంలో పాకిస్థాన్కు చెందిన అజహర్ మహమూద్ కూడా బ్రిటిష్ పాస్పోర్ట్ ఆధారంగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్లో ఆడిన విషయం తెలిసిందే. అదే తరహాలో మహమ్మద్ అమీర్కూ అవకాశం దక్కే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో అవకాశం వస్తే విరాట్ కోహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) లేదా రోహిత్ శర్మకు చెందిన ముంబై ఇండియన్స్ జట్టులో ఆడాలని తన కోరిక అని అమీర్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. దీంతో ఐపీఎల్ అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
బ్రిటిష్ పాస్పోర్ట్ పొందిన తర్వాత అమీర్ హోదా ఇంగ్లండ్ దేశీయ క్రికెట్లో కూడా మారింది. ప్రస్తుతం అతను టీ20 బ్లాస్ట్లో నాటింగ్హామ్షైర్ తరఫున, అలాగే ‘ది హండ్రెడ్’లో ట్రెంట్ రాకెట్స్ తరఫున దేశీయ ఆటగాడిగా ఆడుతున్నాడు. ఇకపై అతను విదేశీ ఆటగాడిగా పరిగణించబడడు. 2024 టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహమ్మద్ అమీర్, పాకిస్థాన్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ విశేష సేవలు అందించాడు. ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వంతో ఐపీఎల్లో అడుగుపెట్టే అవకాశం వస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారింది.

