ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే మైదానంలో ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ కీలక మ్యాచ్లో దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు ఆడుతారో లేదో అన్న అనిశ్చితి నెలకొంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్కు ముందు ఇద్దరు స్టార్ ప్లేయర్ల అందుబాటుపై ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
ముంబై ఇండియన్స్ మీడియా మేనేజర్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్పాడు. టాస్కు ముందు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రోహిత్ ఇప్పటికే మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని తెలుస్తోంది. మరోసారి అతడి ఫిట్నెస్ పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ గాయపడిన పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ 78, 35, 5, 19 పరుగులు చేశాడు.
ఎంఎస్ ధోనీ ఆడే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సీఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ మాట్లాడుతూ.. ధోనీ స్వయంగా, టీమ్ మెడికల్ సిబ్బంది కలిసి ఈరోజు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ధోనీ పూర్తిగా ఫిట్గా ఉంటేనే మైదానంలోకి దిగుతాడని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో ధోనీ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే. రోహిత్, ధోనీ ఇద్దరూ ఈరోజు మ్యాచ్లో ఆడతారా లేదా అన్నది టాస్ సమయానికే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు లెజెండ్స్ మైదానంలోకి దిగుతారని అభిమానులు ఆశిస్తున్నారు.
