ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆకర్షించిన 15 ఏళ్ల వండర్కిడ్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మైదానం వెలుపల కూడా భారీగా పెరుగుతోంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడమే కాకుండా, ఒకే ఎడిషన్లో 750కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా నిలిచిన వైభవ్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే అతని బ్రాండ్ ప్రకటనల ‘ఆస్కింగ్ ప్రైస్’ భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
పరిశ్రమ నిపుణుల సమాచారం ప్రకారం.. ఐపీఎల్కు ముందు వైభవ్ కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లతో ఏడాదికి దాదాపు రూ. 1 కోటి పరిధిలో ఒప్పందాలు చేసుకున్నాడు. ఐపీఎల్ సమయంలో గూగుల్ యాడ్స్లోనూ కనిపించాడు. అయితే, టోర్నమెంట్లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP)గా నిలిచి, 72 సిక్సర్లతో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత అతని డిమాండ్ రెట్టింపు అయింది. ప్రస్తుతం అతని తరఫున ప్రకటనల కోసం ఏడాదికి రూ. 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే శ్రీలంకలో జరిగే ఇండియా-ఎ త్రైపాక్షిక సిరీస్కు ఎంపికైన వైభవ్, ఈ నెల చివర్లో ఐర్లాండ్తో జరిగే సిరీస్ ద్వారా భారత సీనియర్ జట్టులోనూ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అతని అసాధారణ ప్రతిభపై భారత మాజీ కోచ్, 1983 ప్రపంచకప్ విజేత మదన్ లాల్ ప్రశంసల వర్షం కురిపించారు. సూర్యవంశీకి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల లాంటి మైండ్సెట్, దేవుడిచ్చిన ప్రతిభ ఉన్నాయని కొనియాడారు. ప్రస్తుత టాప్ టీ20 ఆటగాళ్లయిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ స్థాయిలోనే వైభవ్ ఆటతీరు ఉందన్న ఆయన, భవిష్యత్తులో ఈ కుర్రాడి కోసం కొందరు సీనియర్ ప్లేయర్లు జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. మొత్తానికి అతి చిన్న వయసులోనే అటు రికార్డులతో పాటు ఇటు సంపాదనలోనూ వైభవ్ సూర్యవంశీ సంచలనాలు సృష్టిస్తున్నాడు.
