Suryakumar Yadav: కొన్ని నెలల క్రితం వరకు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అంతా సూర్యకుమార్ యాదవ్ నామస్మరణే వినిపించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య టీ20 ప్రపంచకప్ను గెలిచి, ఆ ట్రోఫీతో సూర్య దిగిన ఫోటోలకు లక్షల సంఖ్యలో లైకులు వచ్చాయి. ప్రపంచకప్ను విజయవంతంగా డిఫెండ్ చేసిన కెప్టెన్గా రాత్రికి రాత్రే దేశం మెచ్చిన హీరో అయిపోయాడు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో సూర్య ఘోరంగా విఫలం కావడంతో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. అసలు టీ20 ఫార్మాట్లో భారత్ను నడిపించడానికి ఇతనే కరెక్ట్ పర్సనేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. దీనికి తోడు బీసీసీఐ సెలక్టర్లు ఇప్పుడు 2028 టీ20 ప్రపంచకప్, అలాగే అదే ఏడాది జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా, కనీసం జట్టులోనైనా సూర్యకుమార్ స్థానం నిలబడుతుందా లేదా అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఒక ఏడాది కాలంలోనే అటు ఆసియా కప్, ఇటు ప్రపంచకప్ గెలిపించిన ఒక అగ్రశ్రేణి ఆటగాడికి ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా షాకింగ్ విషయమే. కానీ, సూర్య పరుగుల గణాంకాలను లోతుగా పరిశీలిస్తే.. యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో సూర్య వరుసగా అవకాశాలను ఎలా చేజార్చుకున్నాడో స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి సూర్యకుమార్ ఫామ్ కోల్పోవడం ఇది తొలి సారి కాదు. మనం కాస్త వెనక్కి వెళ్లి 2025 ఆసియా కప్ను చూస్తే.. ఆ టోర్నీలో పాకిస్థాన్పై మూడుసార్లు గెలిచి భారత్ టైటిల్ కొట్టడంతో దేశమంతా పండుగ చేసుకుంది. కానీ, ఆ సంబరాల్లో సూర్యకుమార్ ఘోర వైఫల్యం మరుగునపడిపోయింది. ఆ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ల్లో సూర్య చేసింది కేవలం 72 పరుగులు మాత్రమే. జట్టు గెలవడంతో అప్పట్లో ఎవరూ దీనిపై పెద్దగా ప్రశ్నించలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్లలోనూ సూర్య ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. చివరకు 2026 జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన హోమ్ సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ 2026 రావడంతో సూర్య ఫామ్లోకి రావడం జట్టుకు కలిసొస్తుందని భావించారు.
అనుకున్నట్లుగానే ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే అమెరికాపై సూర్యకుమార్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచి దుమ్మురేపాడు. అయితే ఆ టోర్నీ మొత్తంలో అదే ఏకైక హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. మొత్తం 9 మ్యాచ్ల్లో 30.25 సగటుతో 242 పరుగులు చేశాడు. అయితే భారత్ ప్రపంచకప్ గెలవడం, సూర్య కెప్టెన్సీ బాగుండడంతో అభిమానులు, నిపుణులు సూర్యకుమార్ను మెచ్చుకున్నారే తప్ప జట్టు నుంచి తీసేయాలనే డిమాండ్లు రాలేదు.
అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఫామ్ కోల్పోయినా.. ఐపీఎల్లో తిరిగి పుంజుకుంటాడని అందరూ భావించారు. నాణ్యమైన బౌలింగ్ను ఎదుర్కొని ఫామ్లోకి రావడానికి ఐపీఎల్ కంటే మంచి వేదిక ఏముంటుంది? కానీ, అక్కడ కూడా సీన్ రివర్స్ అయింది. ఈ సీజన్లో సూర్య కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. 20.77 బ్యాటింగ్ సగటుతో సూర్య తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అభిమానుల సహనం నశించింది, నిపుణులు సైతం సూర్య బ్యాటింగ్ శైలిపై పెదవి విరిచారు. ఒకప్పుడు సూర్యకు బలంగా ఉన్న అసాధారణమైన షాట్లు (unconventional strokes) ఇప్పుడు ప్రత్యర్థి జట్లకు బలహీనతగా మారిపోయాయి. బౌలర్లు వీక్ పాయింట్స్ను ఈజీగా పసిగట్టేస్తున్నారు.
మరోవైపు.. ప్రస్తుతం భారత క్రికెట్ ఒక కీలక మలుపులో ఉంది. 2028లో జరిగే టీ20 ప్రపంచకప్, ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కోసం ఒక సరికొత్త జట్టును, దాన్ని ముందుండి నడిపించే ఒక యువ నాయకుడిని తయారు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన చూస్తే, ప్రస్తుతం ఫామ్ కోల్పోయి, 35 ఏళ్ల వయసుకు చేరుకున్న సూర్యకుమార్ యాదవ్ బోర్డు భవిష్యత్తు ప్రణాళికల్లో ఫిట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయడమే కాకుండా, 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడు. వీరితో పాటు సంజు శామ్సన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్ల పేర్లు సైతం గట్టిగా వినిపిస్తున్నాయి. భారత్కు ఒక కొత్త నాయకుడిని అందించడంతో పాటు బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తున్న బీసీసీఐ, రానున్న రోజుల్లో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
