ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ కూడా బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్ల్లో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఓడిపోయిన తర్వాత పంత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే లైవ్ టీవీ ఇంటర్వ్యూలో పంత్ తీవ్ర అసహనంతో ఒక బూతు పదాన్ని (F-word) ఉపయోగించాడు. ‘మేము చాలా మంచి టీమ్’ అని చెప్తూనే ఆ మాట వాడాడు. దీనిపై పంత్కు వ్యతిరేకంగా విమర్శలు వస్తుండటంతో.. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అతనికి మద్దతుగా నిలిచారు. తప్పు పంత్ది కాదని, మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంటర్వ్యూలు తీసుకునే బ్రాడ్కాస్టర్లదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
గవాస్కర్ ఒక పత్రికలో ఇలా రాస్తూ..
‘మ్యాచ్లో ఓడిపోయిన వెంటనే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ జట్టు కెప్టెన్ను ఇంటర్వ్యూ చేయడం ఎంతవరకు అవసరమో ఆలోచించాలి. ముఖ్యంగా చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగి ఓడిపోయినప్పుడు కెప్టెన్ చాలా బాధలో ఉంటాడు. పైగా పంత్ వికెట్ కీపర్ కూడా. అంత ఎండలో ప్రతి బాల్కు అటు ఇటు పరిగెత్తి అలసిపోయి ఉంటాడు. అలాంటి సమయంలో సహజంగానే కోపం, నిరాశ ఎక్కువగా ఉంటాయి.’
‘విజేత జట్టులోని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో ముందుగా మాట్లాడటం మంచి పద్ధతి. ఆ సమయంలో ఓడిపోయిన జట్టు కెప్టెన్కు కాస్త సమయం ఇవ్వాలి. అతను మొహం కడుక్కుని, కాస్త ప్రశాంతత పొందాక ఇంటర్వ్యూకు పిలవాలి. ప్రెజెంటేషన్ కార్యక్రమం సిద్ధం కావడానికి ఎలాగూ సమయం పడుతుంది కాబట్టి, ఆ కొద్ది నిమిషాల గ్యాప్ ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవచ్చు” అని గవాస్కర్ సూచించారు.
పంత్ ఎప్పుడూ నవ్వుతూ, ఉత్సాహంగా ఉండే ఆటగాడని గవాస్కర్ గుర్తు చేశారు. అంతటి ప్రశాంతమైన ఆటగాడే అలా కోప్పడ్డాడంటే, మ్యాచ్ ముగిసిన వెంటనే మైక్ పట్టుకుని అతని ముందుకు వెళ్ళడమే కారణమని చెప్పారు. ఆలోచించుకోవడానికి కనీసం కొన్ని నిమిషాల సమయం కూడా ఇవ్వకపోవడం సరికాదని గవాస్కర్ స్పష్టం చేశారు.
