SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక సమాచారం వెలువడింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ దూరమైన విషయం తెలిసిందే. కార్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన ఎడమచేతి వాటం బౌలర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్రైజర్స్ మంగళవారం ప్రకటించింది. మదుశంకను రూ.75 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. మధుశంక శ్రీలంక తరఫున 1 టెస్టు, 28 వన్డేలు, 19 టీ20లు ఆడి అంతర్జాతీయ క్రికెట్లో 70 వికెట్లు పడగొట్టాడు. ఈ శ్రీలంక బౌలర్ గతంలో ముంబై ఇండియన్స్ (MI) జట్టులో ఆడాడు. ఎస్ఆర్హెచ్ తరఫున బాగా రాణిస్తాడని ఆశిస్తున్నారు.
READ MORE:YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్ బ్రైడన్ కార్స్ గాయపడ్డాడు. మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లోనూ ఆడలేదు. వాస్తవానికి.. కార్స్ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్. ఇక నెట్స్ ప్రాక్టీస్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కార్స్ కుడి చేతికి బంతి బలంగా తగిలింది. దీంతో అతని చేయి వాచిపోయింది. మొదట తీవ్రత తక్కువగానే ఉంటుందని అందరూ భావించారు. తరువాత వాపు పెరగడంతో బాల్ పట్టుకోవడానికి (గ్రిప్) ఇబ్బంది పడ్డాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్లో ఓటమి అనంతరం ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి కార్స్ పరిస్థితిపై స్పందించారు. “అతని చేతికి ఎముకలేవీ విరగలేదు. కానీ వాపు ఎక్కువగా ఉంది. మ్యాచ్ ఆడటానికి తను ప్రయత్నించినప్పటికీ, బంతిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. అతను కోలుకుంటున్నాడు, కోల్కతాలో జరిగే తదుపరి మ్యాచ్కల్లా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం” అని వెట్టోరి తెలిపారు. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచులకు సైతం కార్స్ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మధుశంక ఎంట్రీ ఇచ్చాడు.
