సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2026 ప్రయాణం అభిమానులకు కాస్త నిరాశతోనే ముగిసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోవడంతో హైదరాబాద్ టోర్నీ నుంచి తప్పుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచినప్పటికీ, కీలకమైన నాకౌట్ మ్యాచ్లో మాత్రం విజయం సాధించలేకపోయింది. టోర్నీలో జట్టు ప్రదర్శన బాగున్నప్పటికీ, టైటిల్ గెలవలేకపోవడం అభిమానులను బాధించింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సీజన్ కోసం జట్టును మరింత బలంగా మార్చాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా భారీ ధర పెట్టి కొన్నా, ఆశించిన స్థాయిలో రాణించని కొందరు ఆటగాళ్లను, అలాగే గాయాల వల్ల జట్టుకు దూరం అయిన వారిని వదిలేయాలని చూస్తోంది. దీనివల్ల వేలంలో కొత్త ఆటగాళ్లను కొనడానికి నిధులు దొరుకుతాయి.
ముఖ్యంగా రూ. 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి, 15 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అలాగే సీనియర్ బౌలర్ హర్షల్ పటేల్ను రూ. 8 కోట్లకు తీసుకున్నా, ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. యువ బౌలర్లు రాణించడంతో ఇతడిని వచ్చే ఏడాది దూరం పెట్టే అవకాశం ఉంది.
వీరితో పాటు కేవలం నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు తీసిన జయదేవ్ ఉనద్కత్, గాయాల వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన బ్రైడన్ కార్స్, శివమ్ మావిలను కూడా జట్టు వదులుకునేలా కనిపిస్తోంది. కార్స్ స్థానంలో వచ్చిన డేవిడ్ పేన్ కూడా గాయం కారణంగా రెండు మ్యాచ్లకే పరిమితమయ్యాడు. గత సీజన్లో బాగా ఆడినా, ఈసారి ఒక్క అవకాశం కూడా రాని శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ కూడా జట్టును వీడే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే సీజన్లో సరికొత్త సన్రైజర్స్ జట్టును చూడబోతున్నాం.
