Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Pat Cummins

Pat Cummins

Pat Cummins: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య శుక్రవారం (మే 22న) ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. హైదరాబాద్ విధించిన 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ తడబడింది. నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి పరాజయం పాలైంది. హైదరాబాద్ జట్టు బెంగళూరుపై 55 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు సాధించిన భారీ స్కోరు తనను ఎంతగానో ఆకట్టుకుందని, బ్యాటర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, బౌలర్లు సైతం అద్భుతమైన ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పాడు. ప్రస్తుతం జట్టులోని ప్రతి ఒక్కరూ ఫుల్ ఫామ్‌లో ఉండటం సంతోషంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(56), ఇషాన్ కిషన్(79), క్లాసెన్(51) అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. కానీ.. బ్యాటర్ల కంటే బౌలర్లే ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినట్లు కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ చివర్లో ప్రత్యర్థి జట్టు గెలుపునకు చాలా దగ్గరగా వచ్చిందని, అయితే తాము ఆ స్కోరును డిఫెండ్ చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నించామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వారిని కట్టడి చేయడానికి మ్యాచ్‌లో కొన్ని కొత్త వ్యూహాలను, ప్రయోగాలను సైతం అమలు చేశామని, ఏదేమైనప్పటికీ ఇదొక భారీ విజయమని ఆనందం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తన జట్టు బౌలింగ్ యూనిట్‌పై కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో బౌలింగ్ అద్భుతంగా వేశారని, సీనియర్ కెప్టెన్ అయినప్పటికీ తన టీమ్ బౌలింగ్ శైలిని చూసి తాను కూడా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్ మొత్తం ఈశాన్ మలింగ బౌలింగ్ చేసిన తీరు, ముఖ్యంగా పవర్‌ప్లేలో అతడు వికెట్లు తీసిన విధానం అమోఘమని మెచ్చుకున్నాడు. తన స్లోయర్ బాల్స్, వైవిధ్యమైన బౌలింగ్‌తో మలింగ ఈ టోర్నమెంట్‌లోనే బెస్ట్ బౌలర్‌గా మారాడని చెప్పాడు. అతడితో పాటు సాకిబ్ హుస్సేన్ సైతం అద్భుతంగా రాణిస్తున్నాడని, ఇలాంటి బౌలర్లు ఉండటం ఏ కెప్టెన్‌కైనా ఓ కల లాంటిదని మురిసిపోయాడు. ఇక తదుపరి మ్యాచ్ న్యూ చండీగఢ్‌లో జరగనుండటంపై స్పందిస్తూ.. ఆ మ్యాచ్‌కు ఇంకా ఐదారు రోజుల సమయం ఉందని కమిన్స్ తెలిపాడు. అందువల్ల జట్టు సభ్యులంతా రెండు రోజులు హ్యాపీగా విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత అక్కడికి పయనమవుతామని చెప్పాడు. తమ ఆటగాళ్లకు ఆ గ్రౌండ్ గురించి ముందే బాగా తెలుసని, వచ్చే ఒకటి రెండు రోజుల్లో తాము తదుపరి మ్యాచ్‌లో ఎవరితో తలపడబోతున్నామనేది సైతం స్పష్టత వచ్చేస్తుందని కమిన్స్ వివరించాడు.