Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ పేరు మార్మోగింది. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన 16 మ్యాచ్ల్లో 237.30 స్ట్రైక్ రేట్, 48.50 సగటుతో 776 పరుగులు సాధించి, ‘బేబీ బాస్’గా పేరొందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. త్వరలోనే శ్రీలంకలో జరగబోయే ఇండియా-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల త్రైపాక్షిక వన్డే సిరీస్కు సిద్ధమవుతున్నాడు. ఇంతలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం వైభవ్తో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్శనగా నిలిచాడు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో డగౌట్, బౌండరీ లైన్, ప్రెజెంటేషన్, అహ్మదాబాద్ ఫైనల్, విరాట్ కోహ్లీని కలిసినప్పుడు, చివరకు కుటుంబ ఫోటోలలోనూ ఆ వ్యక్తి వైభవ్ వెంట నీడలా కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. శతకం మిస్ అయి వైభవ్ భావోద్వేగానికి గురైనప్పుడు సైతం అతడిని ఓదార్చిన ఆ వ్యక్తి మరెవరో కాదు, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్. వైభవ్కు ఒక గార్డియన్గా, మెంటార్గా మారిన రోమి భిందర్.. ఇంగ్లాండ్లో క్లబ్ క్రికెట్ ఆడటంతో పాటు విదర్భ, మహారాష్ట్ర, నాగ్పూర్ యూనివర్సిటీల తరఫున జిల్లా స్థాయి క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నవాడు. వరల్డ్ క్రికెట్ అకాడమీ (WCA)తో అనుబంధం కలిగి ఉండి, యువ ఆటగాళ్ల శిక్షణ, గ్రాస్రూట్ క్రికెట్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించిన ఆయన, ప్రస్తుతం నాగ్పూర్ సమీపంలో ఒక రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీని సైతం ఏర్పాటు చేస్తున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఐపీఎల్తో ముడిపడి ఉన్న రోమి భిందర్, రాజస్థాన్ రాయల్స్ మొదటి సీజన్లో లైజన్ ఆఫీసర్గా, ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. స్పోర్ట్స్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉండటం వల్ల ఆటగాళ్లను మానసికంగా సిద్ధం చేయడంలో ఆయన దిట్ట. అయితే, ఐపీఎల్ 2026లో గువాహటిలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా డగౌట్లో వైభవ్ పక్కన కూర్చుని మొబైల్ ఉపయోగించడం వల్ల బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి, 1 లక్ష రూపాయల జరిమానా విధించింది. కానీ, వైద్య కారణాల వల్లే ఫోన్ వాడాల్సి వచ్చిందని గుర్తించి, అనుభవాన్ని గౌరవిస్తూ హెచ్చరికతో కేసు ముగించారు. ఇక, పక్కనే ఉన్న వైభవ్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోమి భిందర్ పర్యవేక్షణలో పెరిగిన వైభవ్ సూర్యవంశీ కేవలం 440 బంతుల్లోనే 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసి ఆండ్రీ రస్సెల్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సీజన్ ముగిసేసరికి MVP, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ సిక్సెస్ వంటి ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ ముగించుకుని వైభవ్ తన ఇంటికి చేరుకున్నప్పుడు సైతం రోమి భిందర్ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. వైభవ్ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ తరుణంలో ఫోటోలు తీయడానికి జనం ఎగబడగా, పూల వర్షం కురిపిస్తూ నినాదాలు చేస్తున్న భారీ రద్దీని మేనేజ్ చేస్తూ వైభవ్ను సురక్షితంగా కారు వైపు నడిపించారు. జనం కారును చుట్టుముట్టడంతో డోర్ వేయడానికి ఇబ్బంది పడినప్పటికీ, రోమి భిందర్ దగ్గరుండి అంతా చూసుకున్నారు. ఐపీఎల్ ప్రయాణంలో ఎంఎస్ ధోని వైభవ్ను చూసి “ఈ పిల్లాడు ఎంతో పరిణతి చెందిన ఆటగాడిలా షాట్లు ఆడతాడు” అని ప్రశంసించాడని, అలాగే విరాట్ కోహ్లీ వైభవ్కు ఎల్లప్పుడూ వినయంగా ఉంటూ కష్టపడాలని సలహా ఇచ్చాడని రోమి భిందర్ ఆ విశేషాలను పంచుకున్నారు.
