Pat Cummins: గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడం అభిమానులను షాక్కు గురిచేసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ను డకౌట్ చేసి హైదరాబాద్ పతనాన్ని ప్రారంభించగా.. ఆ వెంటనే కగిసో రబడ తన ధాటికి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లను పెవిలియన్ పంపాడు. దీంతో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ కోలుకోలేకపోయింది. డేంజరస్ హెన్రిచ్ క్లాసెన్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లందరూ జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో చేతులెత్తేశారు. కెప్టెన్ పాట్ కమిన్స్ చివర్లో ఒక సిక్స్, ఫోర్ కొట్టి కాసేపు పోరాడినా.. రషీద్ ఖాన్ వేసిన బంతికి చివరి వికెట్ స్టంపింగ్గా వెనుదిరగడంతో హైదరాబాద్ కథ ముగిసింది.
ఇక, ఈ ఓటమిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందిస్తూ.. గుజరాత్ బౌలర్ల ప్రదర్శనను ప్రశంసించాడు. రెండో ఇన్నింగ్స్లో వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని.. ముఖ్యంగా పిచ్పై లెంగ్త్ బాల్స్ వేస్తూ తమకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదన్నాడు. వాళ్ల బౌలింగ్ చూస్తుంటే టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ స్పెల్స్లో ఒకటిగా అనిపించిందని కొనియాడాడు. తమ జట్టు బౌలింగ్ సమయంలో లెంగ్త్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందన్నాడు. అయితే ఈ ఒక్క మ్యాచ్తో కంగారు పడాల్సిన పనిలేదని, తమ టాప్-4 బ్యాటర్లందరూ ఇప్పటికే 400 పైగా పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నారని ధీమా వ్యక్తం చేశాడు. గత ఏడు మ్యాచ్ల్లో ఐదు గెలిచి ఉండటం తమకు కాస్త ఊరటనిచ్చే విషయమని, ప్లేఆఫ్స్ అర్హత సాధించడానికి ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయని తెలిపాడు. ఈ పరాజయాన్ని మర్చిపోయి తదుపరి మ్యాచ్లపై దృష్టి పెడతామని కమిన్స్ స్పష్టం చేశాడు.
