ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఆటతోనే కాకుండా, తన క్యూట్ యాక్టింగ్తోనూ అందరి మనసులు గెలుచుకున్నాడు. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 15 ఏళ్ల ఈ కుర్రాడు 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే.. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ దాటిన తర్వాత వైభవ్ ఇంగ్లీష్ అక్షరం ‘A’ ఆకారంలో చేతులు చూపిస్తూ విభిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ ‘A’ సీక్రెట్ ఏంటని మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటర్ మురళీ కార్తీక్ అడగ్గా.. “అలాంటిదేం లేదు సార్, నేను ప్రతి మ్యాచ్లో ఏదోక కొత్త స్టైల్ ట్రై చేస్తుంటాను, దీని వెనుక పెద్దగా అర్థం లేదు” అంటూ నవ్వేసి దాటవేశాడు.
కానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీమ్ అధికారిక ప్రతినిధి రోమి భిందర్తో వైభవ్ అసలు రహస్యాన్ని పంచుకున్నాడు. ఈ సెలబ్రేషన్ మరెవరికో కాదు.. తన ప్రాణమైన అమ్మ కోసమేనని చెప్పాడు. వైభవ్ తల్లి పేరు ‘ఆరతి సూర్యవంశీ’. ఆమె పేరులోని మొదటి అక్షరం ‘A’ వచ్చేలా తను ఆ సైగ చేశానని తెలిపాడు.
“ఈ సెలబ్రేషన్ను మా అమ్మకు అంకితం ఇస్తున్నాను. ఆమె పేరు ‘A’ తో మొదలవుతుంది. అందుకే ఈ విషయాన్ని అందరికీ చెప్పకూడదు అనుకున్నాను. ఇదొక పెద్ద విషయంగా మార్చడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా నేను అమ్మ కోసం ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను” అని వైభవ్ చాలా ఎమోషనల్గా చెప్పాడు.
జైస్వాల్ సపోర్ట్.. వైభవ్ మెరుపులు..
ఈ మ్యాచ్లో 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు పవర్ప్లేలో మంచి ఆరంభం అవసరమైంది. మొదట్లో వైభవ్ సూర్యవంశీ కొంచెం నిదానంగా ఆడాడు. ఆ సమయంలో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ బాధ్యత తీసుకున్నాడు. లక్నో బౌలర్లపై విరుచుకుపడుతూ 43 పరుగులు చేసి జట్టుకు మంచి మొమెంటం ఇచ్చాడు. జైస్వాల్ అలా వేగంగా ఆడటం వల్ల వైభవ్కు పిచ్ను అర్థం చేసుకోవడానికి, సెట్ అవ్వడానికి తగినంత సమయం దొరికింది. రన్ రేట్ ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం లభించింది. ఇక ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక వైభవ్ అసలు రూపం చూపించాడు. బౌండరీలు, సిక్సర్లతో లక్నో బౌలింగ్ అటాక్ను ముక్కలు ముక్కలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణతితో ఆడి మ్యాచ్ను మలుపు తిప్పిన ఈ కుర్రాడిపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.
