ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మళ్లీ ఫామ్లోకి వచ్చింది. బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి లక్నోను చిత్తు చేసింది.
మ్యాచ్ హైలైట్స్..
టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ యువ బౌలర్ రసీఖ్ దార్ నిప్పులు చెరిగే బౌలింగ్తో లక్నో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39) కాసేపు పోరాడినప్పటికీ, మిగిలిన ఆటగాళ్లు విఫలమవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.
Also Read:Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..
కోహ్లీ మెరుపులు..
147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. స్టేడియం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన కోహ్లీ 49 పరుగులు చేసి తృటిలో అర్ధసెంచరీ చేజార్చుకున్నాడు. అయినప్పటికీ జట్టును విజయానికి చేరువ చేశాడు. రజత్ పాటిదార్ (27) కూడా విలువైన పరుగులు జోడించడంతో ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ భారీ విజయం తర్వాత ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం వల్ల ఆర్సీబీ నెట్ రన్ రేట్ కూడా గణనీయంగా పెరిగి +1.503 వద్ద కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో సొంత అభిమానుల మధ్య కోహ్లీ సేన జైత్రయాత్ర కొనసాగించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ముఖ్యంగా రసీఖ్ దార్ బౌలింగ్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.