ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపునకు వస్తున్న వేళ, కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్కు దిగనుంది.
ఈ మ్యాచ్ కేకేఆర్కు చావో రేవో లాంటిది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ కోల్కతా భారీ తేడాతో గెలవాల్సిందే. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న రహానే సేన.. అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పిచ్ కండిషన్స్ దృష్ట్యా చేజింగ్ సులభం అవుతుందనే నమ్మకంతో రహానే బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. వారు గత మ్యాచ్లో ఆడిన సేమ్ టీమ్తోనే ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నారు.
ముంబై కెప్టెన్ల రికార్డు..
మరోవైపు, ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్లో కేవలం తమ ఆత్మగౌరవం కోసం, పట్టికలో మెరుగైన స్థానం కోసం ఆడుతోంది. గాయం నుండి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ సమయంలో మాట్లాడుతూ.. తాము కూడా మొదట బౌలింగ్ చేయడానికే ఇష్టపడేవాళ్లమని చెప్పాడు. ముంబై ఇండియన్స్కు ఘనమైన చరిత్ర ఉందని, చివరి మ్యాచ్ల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి తల ఎత్తుకుని టోర్నీ ముగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఒక విచిత్రమైన రికార్డును మూటగట్టుకుంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు (సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా) జట్టును నడిపించారు. ఐపీఎల్ చరిత్రలో గతంలో 2013లో పూణే వారియర్స్ ఇండియా జట్టు మాత్రమే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ముంబై జట్టులో నేడు హార్దిక్ పాండ్యాతో పాటు అల్లా గజన్ఫర్ జట్టులోకి వచ్చారు. ఈ పోరులో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను ముంబై దెబ్బతీస్తుందా? లేక రహానే సేన విజయం సాధిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
