Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్‌లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్

  • ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్
  • డీసీపై తీవ్ర విమర్శలు
  • అందుకే భారీ మూల్యం చెల్లించుకున్నాం
Hemang Badani Dc

Hemang Badani Dc

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. వరుసగా ఐదో ఏడాది కూడా టాప్-4లో చోటు దక్కకపోవడంతో డీసీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్‌ను ఢిల్లీ ఆరో స్థానంలో ముగించింది. 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఏడు ఓటములతో 14 పాయింట్లు మాత్రమే సాధించింది. కీలక సమయాల్లో మ్యాచ్‌లను ముగించలేకపోవడమే తమ వైఫల్యానికి ప్రధాన కారణమని డీసీ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ అంగీకరించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన బదానీ.. ఈ సీజన్‌లో ఎన్నో మ్యాచ్‌లు తమ చేతుల్లో నుంచి జారిపోయాయని పేర్కొన్నాడు.

‘చాలా మ్యాచ్‌లలో మేము విజయం సాధించాల్సింది. కానీ కీలక సమయాల్లో మా ప్లేయర్స్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. గుజరాత్ టైటాన్స్‌పై ఒక్క పరుగుతో ఓడిపోయిన మ్యాచ్ ఇప్పటికీ బాధగానే ఉంటుంది. అలాగే పంజాబ్ కింగ్స్‌పై 264 పరుగుల భారీ స్కోర్ చేసినా.. దాన్ని కాపాడుకోలేకపోయాం. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల్లో కీలక క్యాచ్‌లు వదిలేయడం కూడా మాకు భారీ నష్టంను కలిగించింది’ అని హేమంగ్ బదానీ వెల్లడించాడు. ఈ సీజన్‌లో డీసీ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నిలకడ లేకపోవడం జట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది.

బ్యాటర్లు తరచూ వరుస వికెట్లు కోల్పోవడం ఢిల్లీకి పెద్ద సమస్యగా మారిందని హేమంగ్ బదానీ చెప్పాడు. ‘బ్యాటింగ్‌లో మేము చాలా సార్లు వరుసగా వికెట్లు కోల్పోయాం. అదే మ్యాచ్‌లను మలుపు తిప్పింది. బౌలింగ్ పరంగా చూస్తే.. ఎక్కువ వికెట్లు తీసే జట్లు సాధారణంగా టోర్నీలో ముందంజలో ఉంటాయి. కానీ మా బౌలర్లు 14 మ్యాచ్‌ల్లో కేవలం 64 వికెట్లు మాత్రమే తీశారు. ఇది లీగ్‌లో అత్యల్ప గణాంకాల్లో ఒకటి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గైర్హాజరీ కూడా మా ప్రస్థానాన్ని దెబ్బతీసింది. గత సీజన్‌లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్క్.. ఈసారి తొలి తొమ్మిది మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. స్టార్క్ లేకపోయినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మాకు చాలానే వచ్చాయి. చిన్న చిన్న తప్పిదాలు చేయకుండా ఉంటే మేము ఇప్పటికీ టోర్నీలో కొనసాగేవాళ్లం’ అని బదానీ తెలిపాడు.

ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఫ్రాంచైజీల్లో ఉన్నాయి. డీసీ అత్యుత్తమ ప్రదర్శన 2020లో నమోదైంది. ఆ సీజన్‌లో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి టైటిల్ కల నెరవేరకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఢిల్హ్హ్య్ క్యాపిటల్స్ గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరుతో ఆడిన విషయం తెలిసిందే. పేరు మార్చుకున్నా.. ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు.