Arshdeep Singh: భారీ షాకిచ్చిన అర్ష్‌దీప్ సింగ్.. విరాట్ కోహ్లీ వైరల్ వీడియో కూడా డిలీట్!

  • ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌ దారుణ ప్రదర్శన
  • దారుణంగా అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన
  • కోహ్లీ వైరల్ వీడియోను డిలీట్ చేసిన అర్ష్‌దీప్
Arshdeep Singh Virat Kohli

Arshdeep Singh Virat Kohli

Arshdeep Singh Deletes Instagram Posts: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్) దారుణ ప్రదర్శన చేసింది. మొదటి 7 మ్యాచ్‌లలో అపజయమే లేని పీబీకేఎస్ ఆపై వరుస ఓటములను ఎదుర్కొని.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్ జట్టుపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీబీకేఎస్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ కేవలం 14 వికెట్లు మాత్రమే తీసుకోగా.. ఎకానమీ రేట్ 10కు పైగానే నమోదైంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అర్ష్‌దీప్ సోషల్ మీడియాలో చేసిన ఓ పని అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అర్ష్‌దీప్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టులను తొలగించాడు. కొన్ని రోజుల క్రితం వరకు అతడి అకౌంట్‌లో పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం కేవలం 44 పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి చేసిన వైరల్ రీల్ కూడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గత ఏడాది డిసెంబర్‌లో అర్ష్‌దీప్, కోహ్లీ కలిసి చేసిన సరదా వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ రీల్‌కు 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ వీడియోలో అర్ష్‌దీప్.. ‘పాజీ, టార్గెట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటే సెంచరీ ఖాయంగా వచ్చేది’ అంటూ కోహ్లీతో సరదాగా అన్నాడు. దీనికి కోహ్లీ నవ్వుతూ.. ‘టాస్ మేం గెలవడం నీ అదృష్టం. లేదంటే డ్యూ పరిస్థితుల్లో నిన్ను కూడా బాగా కొట్టేవాళ్లు’ అంటూ చమత్కరించాడు. ఈ సరదా సంభాషణ అప్పట్లో నెట్టింట బాగా వైరల్ అయింది.

అయితే ఇప్పుడు ఆ వీడియోతో పాటు పలు పోస్టులు కూడా అర్ష్‌దీప్ సింగ్ అకౌంట్ నుంచి మాయమయ్యాయి. దీనికి గల అసలు కారణం ఏంటన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఇటీవల పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల సోషల్ మీడియా పోస్టులపై ఫ్రాంచైజీ కఠిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపై ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు, కంటెంట్‌ను కేవలం ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే పోస్టు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై జట్టు వర్గాలు స్పందిస్తూ.. ‘బీసీసీఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఆటగాళ్లు గౌరవించాలి. ట్రైనింగ్ అనంతరం సీఈఓ ఆటగాళ్లతో మాట్లాడి కొత్త నిబంధనలను వివరించనున్నారు’ అని తెలిపాయి. దీంతో అర్ష్‌దీప్ సోషల్ మీడియా క్లీనప్ వెనుక ఇదే కారణమా? అన్న చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సాగుతోంది.