Arshdeep Singh Concedes 24 Runs in an Over: ఐపీఎల్ 2025లో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ ఇరగదీశాడు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున 21 వికెట్లు తీసి అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం తేలిపోతున్నాడు. ఒత్తిడికి లోనై అదనపు పరుగులు ఎక్కువగా ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో మొత్తం 11 బంతులు విసిరాడు. అందులో 4 వైడ్ బంతులు ఉన్నాయి. ఆ ఓవర్లో మొత్తంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా మరోసారి ఒత్తిడికి లోనై చెత్త ప్రదర్శన చేశాడు.
ముల్లాన్పుర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జరుగుతున్న మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ మరో అత్యంత ఖరీదైన ఓవర్ను నమోదు చేశాడు. ఒకే ఓవర్లో 10 బంతులు వేయగా.. ఇందులో నాలుగు వైడ్ బంతులు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగడంతో మొత్తగా 24 రన్స్ సమర్పించుకున్నాడు. అర్ష్దీప్ బౌలింగ్లో రెండు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు. దాంతో అర్ష్దీప్ బౌలింగ్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అర్ష్దీప్ ఇదేం బౌలింగ్, అర్ష్దీప్ సింగ్తో మాములుగా ఉండదు మరి, ఇలా అయితే పంజాబ్ గెలవడం కష్టమే అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ మూడో ఓవర్లో అర్ష్దీప్ సింగ్ 24 రన్స్ ఇచ్చుకున్నాడు. మొదట షార్ట్ బాల్ను మిడ్వికెట్ వైపు ఫోర్గా మలిచిన అభిషేక్ శర్మ.. తర్వాతి బంతికి అద్భుత టైమింగ్తో మరో ఫోర్ బాదాడు. దాంతో ఒత్తిడికి లోనైన అర్ష్దీప్.. నాలుగు వైడ్లు వేశాడు. ఆపై స్లోయర్ బాల్ను ముందుగానే అంచనా వేసి లాంగ్ ఆన్ మీదుగా అభిషేక్ భారీ సిక్స్ కొట్టాడు. మరో బంతిని షార్ట్ థర్డ్మ్యాన్ మీదుగా టాప్ ఎడ్జ్తో సిక్స్గా మార్చాడు. ఈ ఓవర్లో అర్ష్దీప్ తేలిపోవడంతో పంజాబ్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు సన్రైజర్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.