ఆది నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్లో జట్ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే నిన్న రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడి నెగ్గింది. దీంతో ఫైనల్లో గుజరాత్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో నెగ్గి, ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ కు ఘనమైన నివాళి అర్పించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2008లో మొదలు కాగా, తొలి సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వార్న్ కెప్టెన్ గా పనిచేసి తొలి కప్పు తీసుకొచ్చి పెట్టాడు.
ఆ తర్వాత మళ్లీ రాజస్థాన్ జట్టు కప్పును కైవసం చేసుకోలేదు. అయితే.. ఐపీఎల్ ఫైనల్స్ అనంతరం 45 నిమిషాల పాటు ప్రత్యేక కార్యక్రమానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇందులో పాల్గొననున్నారు. అలాగే, జార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఛౌ డ్యాన్స్ కూడా ఉంటుందని సమాచారం. ఇందుకోసం బీసీసీఐ 10 మంది సభ్యుల జార్ఖండ్ ఛౌ డాన్స్ బృందాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా, టీమిండియా మాజీ కెప్టెన్లు ముగింపు వేడకకు హాజరుకానున్నారు. 2019 సీజన్ నుంచి ఐపీఎల్ ముగింపు వేడుక ఇప్పటి వరకు జరుగలేదు.
