ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ ఒకటి. ఆర్సీబీ ఇటీవల చేతులు మారిన విషయం తెలిసిందే. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు కైవసం చేసుకున్నాయి. రూ.16,706 కోట్ల ధరకు ఈ కన్సార్టియం కొనుగోలు చేసింది. ప్రస్తుతం డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్సీబీ.. ఐపీఎల్ 2026 అనంతరం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఐపీఎల్ 2026 మ్యాచ్లు రసవత్తరంగా సాగుతుండగా.. ఆర్సీబీ నయా ఓనర్ అనన్య బిర్లా సింప్లిసిటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనన్య బిర్లా తన సింప్లిసిటీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ.. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ మహిళగా ఉన్నారు. సుమారు రూ.1770 కోట్ల నెట్ వర్త్ ఉన్న అనన్య.. ఇటీవల ఒక ఈవెంట్లో ఎంతో సింపుల్గా కనిపించారు. ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వెనుక ప్రశాంతంగా కూర్చుని, ఎలాంటి హడావిడి లేకుండా ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమెలో ఆత్మవిశ్వాసం, వినయం ప్రత్యేకంగా నిలిచాయి. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఉండటం అనన్య వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా చూపిస్తోంది. ఆత్మవిశ్వాసం, సాదాసీదా జీవన శైలి ఆమెను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది.
Also Read: Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!
ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగలం బిర్లా కుమార్తనే అనన్య బిర్లా. 1994లో ముంబైలో జన్మించిన అనన్య.. అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదివారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. శక్తివంతమైన వ్యాపార కుటుంబానికి చెందినప్పటికీ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో అనన్య సక్సెస్ అయ్యారు. 17 ఏళ్ల వయసులోనే ‘స్వతంత్ర మైక్రోఫిన్’ అనే సంస్థను స్థాపించారు. గ్రామీణ మహిళలకు చిన్న మొత్తాల్లో రుణాలు అందిస్తూ ఆర్థిక స్వావలంబనకు దోహదపడే ఈ సంస్థ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనంతరం డిజిటల్, కన్స్యూమర్ రంగాల్లో ‘ఇకై అసాయి’ బ్రాండ్ను అనన్య ప్రారంభించారు.
