ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్పై కీలక విజయం సాధించిన అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. పట్టికలో రెండు పాయింట్స్ చేరడం ఆనందంగా ఉందని చెప్పాడు. తాము ప్రతి మ్యాచ్ను ఒక్కో దశగా తీసుకుంటున్నామని పేర్కొన్నాడు. జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైందని రహానే స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మ్యాచ్ అనంతరం అజింక్య రహానే మాట్లాడుతూ…’ఇది చాలా మంచి మ్యాచ్. రెండు పాయింట్లు రావడం చాలా ఆనందంగా ఉంది. మైదానంలో చాలా వేడిగా ఉండటంతో ఆటగాళ్లు అలసిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసి 247 పరుగులు చేయడం గొప్ప విషయం. ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్ అద్భుతంగా ఆడారు. వారి ఉద్దేశం, ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉన్నాయి. నాణ్యమైన బౌలర్లపై వారు ఒత్తిడి తెచ్చారు. బ్యాటర్లు తమ బలాలపై నమ్మకం ఉంచి ఆడారు’ అని అన్నాడు.
కేకేఆర్ జట్టు సన్నద్ధత గురించి అజింక్య రహానే మాట్లాడుతూ… ‘మేము ప్రతి మ్యాచ్ను ఒక్కో దశగా తీసుకుంటున్నాం. క్రికెట్ను సింపుల్గా ఉంచితేనే మంచి ఫలితాలు వస్తాయి. మా ఆటగాళ్లు దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించారు. అదే ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఐపీఎల్లో కనిపిస్తోంది’ అని చెప్పాడు. కొత్త బౌలర్ సౌరభ్ దుబే ప్రదర్శనపై కూడా జింక్స్ ప్రశంసలు కురిపించాడు. ‘సౌరభ్ దూబే విదర్భ లీగ్లో బాగా ఆడాడు. అతడిలో మంచి టాలెంట్ ఉంది. కోచింగ్ సిబ్బంది కూడా నమ్మకం ఉంచారు. దూబే కష్టపడి పడుతున్నాడు. అతడికి మంచి భవిష్యత్ ఉంది’ అని తెలిపాడు.
సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి గురించి కూడా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వరుణ్ గాయంతో ఇబ్బంది పడుతున్నా మ్యాచ్ ఆడాడు. నా జట్టులో సునీల్ నరైన్, వరుణ్ లాంటి బౌలర్లు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు బంతి ఇచ్చినా వారు వికెట్స్ తీస్తారు. ఈ విజయంతో కేకేఆర్ జట్టులో కొత్త ఉత్సాహం నిండింది. జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైంది. ఇక తదుపరి మ్యాచుపై దృష్టి పెట్టాలి’ అని రహానే తెలిపాడు.
