పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం క్రీడా రంగాన్ని కలవరపెడుతోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు స్వదేశం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడటంతో.. రాబోయే ఐపీఎల్ సీజన్పై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ క్రికెటర్ల ప్రయాణంపై ప్రాంఛైజీలు ఆందోళనలో ఉన్నాయి.
వాయు మార్గాల మూసివేత కారణంగా డారెన్ సామి, క్వింటన్ డికాక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కోల్కతాలో చిక్కుకుపోయారు. ఇంగ్లాండ్ జట్టును ముందుగా పంపి.. తమను ఆలస్యం చేయడంపై ఐసీసీపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్, దోహా వంటి కీలక రవాణా కేంద్రాల్లో విమానాలపై ఆంక్షలు ఉండటంతో.. ఈ నెల 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం విదేశీ ఆటగాళ్లు సమయానికి చేరుకోవడం కష్టంగా మారింది. ఇప్పటికే శ్రీలంక-అఫ్గానిస్థాన్ సిరీస్ వాయిదా పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Also Read: Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?
ముఖ్యంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్ల రాకపై ఫ్రాంఛైజీలు ఆందోళన చెందుతున్నాయి. విమాన ఛార్జీలు భారీగా పెరగడం యాజమాన్యాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం అకీల్ హోసిన్, బ్రెవిస్ వంటి ఆటగాళ్లు సకాలంలో జట్టుతో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వంట గ్యాస్ కొరత కారణంగా జట్లకు ఆతిథ్యమిచ్చే హోటళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్న బీసీసీఐ.. కేవలం మొదటి 20 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ను ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికలు మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని మిగతా షెడ్యూల్ను ఖరారు చేయనుంది.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ ఈ నెల 28న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుండగా.. ముంబై, కోల్కతా ఢీకొట్టనున్నాయి. టోర్నీ వాయిదా పడుతుందనే ప్రచారాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరుగుతుందని, ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి బోర్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
