India A vs Sri Lanka A: దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన ఇండియా ‘ఎ’–శ్రీలంక ‘ఎ’ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినా, చివరకు వివాదాలతో ముగిసింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఈ పోరులో శ్రీలంక ‘ఎ’ విజయం సాధించగా, మ్యాచ్ అనంతరం భారత యువ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో ఘర్షణకు దిగడం పెద్ద చర్చకు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యాంశ్ షెడ్గే 72 పరుగులు, విప్రజ్ నిగమ్ 51 పరుగులతో జట్టుకు బలమైన స్కోరు అందించారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ మాత్రం 14 బంతుల్లో 21 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఇక, 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ కూడా 50 ఓవర్లలో 265 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ‘ఎ’ 16 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా ‘ఎ’ 10 పరుగులకే పరిమితమైంది. సూపర్ ఓవర్ చివరి బంతి అనంతరం శ్రీలంక ఆటగాళ్లు విజయోత్సాహంలో సంబరాలు చేసుకుంటుండగా, వైభవ్ సూర్యవంశీ అసహనానికి గురైనట్లు కనిపించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన అతడు, ఒక ఆటగాడిని తోసినట్లు వీడియోల్లో కనిపించింది. దీంతో కొద్దిసేపు మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా సహా పలువురు ఆటగాళ్లు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నప్పటికీ, వైభవ్ కోపం వెంటనే తగ్గలేదు. సహచర ఆటగాళ్లు అతడిని శాంతింపజేసి మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మ్యాచ్లో వివాదం కేవలం చివర్లోనే కాదు. సూపర్ ఓవర్కు ముందు ఇండియా ‘ఎ’ కెప్టెన్ తిలక్ వర్మ కూడా అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. వెలుతురు పరిస్థితులు, ఆట కొనసాగింపు అంశాలపై మొదట చర్చించిన తిలక్, అనంతరం సూపర్ ఓవర్ సమయంలో నో-బాల్ నిర్ణయంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే, వైభవ్ సూర్యవంశీకి మైదానంలో ఇలాంటి సంఘటనలు కొత్తకాదు. గతంలో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా పాకిస్థాన్ యువ బౌలర్ అలీ రజాతో కూడా అతడు వాగ్వాదానికి దిగాడు. అతడి దూకుడు స్వభావం అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, భవిష్యత్తులో ఆట స్ఫూర్తిని కాపాడుకుంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉత్కంఠభరితమైన మ్యాచ్కు బదులుగా, చివర్లో చోటుచేసుకున్న ఈ ఘర్షణలే ఇప్పుడు ఎక్కువగా చర్చకు దారితీస్తున్నాయి.

