Mohammed Siraj: లంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. 15 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్తో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ ఈ మ్యాచ్ను ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. అయితే సిరాజ్ బ్యాటింగ్ ప్రదర్శన వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ రెండో రోజున టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. సిరాజ్తో ప్రత్యేకంగా బ్యాటింగ్ సెషన్ నిర్వహించాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడిగా ఎలాంటి షాట్లు ఆడాలి, బంతిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై రాహుల్ సిరాజ్కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
రాహుల్ నుంచి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్న మరుసటి రోజే సిరాజ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. భారత్ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమైన సమయంలో క్రీజులోకి వచ్చిన సిరాజ్.. కేసర నువంత వేసిన తొలి మూడు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. మొదటి బంతిని డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్గా తరలించిన సిరాజ్.. రెండో బంతికి నేరుగా భారీ షాట్ ఆడాడు. మూడో బంతిని మిడ్వికెట్ మీదుగా బౌండరీ దాటించి మ్యాచ్ను ముగించాడు. సిరాజ్ బ్యాటింగ్ చూసిన అభిమానులు అతడిని సరదాగా ‘సర్ వివియన్ సిరాజ్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్ భారత జట్టుకు పలు సానుకూల అంశాలను అందించింది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అవసరమైన సమయంలో పరుగులు చేయగలరనే నమ్మకం పెరిగింది. అంతకుముందు గర్నూర్ బ్రార్ కూడా బ్యాట్తో మెరిపించడంతో భారత టెయిల్ ఎండర్లలో బ్యాటింగ్ సామర్థ్యం ఉందనే విషయం స్పష్టమైంది. ఇక, భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలేలో ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో సిరాజ్ బ్యాటింగ్ ప్రదర్శన జట్టుకు అదనపు ఉత్సాహాన్ని ఇచ్చింది. గాలేలో స్పిన్కు అనుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో లోయర్ ఆర్డర్ నుంచి వచ్చే కీలక పరుగులు భారత విజయావకాశాల్లో ముఖ్యపాత్ర పోషించవచ్చు.

