India Women Create T20 World Cup History With Record 209: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో 200కు పైగా స్కోరు చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో నెదర్లాండ్స్పై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇది మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ నమోదు చేసిన అత్యధిక స్కోరుగా నిలిచింది. భారత్ కంటే ముందు రెండుసార్లు ఇంగ్లండ్ ఈ ఘనత అందుకుంది.
2026లో ఎడ్జ్బాస్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 219/1 స్కోర్ చేసింది. 2023లో కేప్టౌన్ వేదికగా పాకిస్థాన్పై ఇంగ్లీష్ జట్టు 213/5 పరుగులు చేసింది. తాజాగా భారత్ 209 పరుగులు చేసి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. 2020లో దక్షిణాఫ్రికా (థాయ్లాండ్-195/3), 2018లో భారత్ (న్యూజిలాండ్-194/5) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్పై భారీ స్కోర్ చేయడమే కాదు.. 95 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు స్మృతి మంధానా, షెఫాలీ వర్మ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్కు కేవలం 70 బంతుల్లో 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించారు. మంధానా 47 బంతుల్లో 74 పరుగులు చేయగా, షెఫాలీ 38 బంతుల్లో 55 పరుగులతో మెరిశారు. పవర్ప్లేలోనే భారత్ 59 పరుగులు సాధించగా.. షెఫాలీ దూకుడైన బ్యాటింగ్తో నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడింది. అనంతరం మంధానా కూడా వేగం పెంచి బౌండరీల వర్షం కురిపించింది. ముఖ్యంగా 15వ ఓవర్లో వరుసగా నాలుగు బౌండరీలు బాది ప్రేక్షకులను అలరించింది. రిచా ఘోష్ (8 బంతుల్లో 20 పరుగులు), దీప్తి శర్మ (2 బంతుల్లో 10 పరుగులు) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్లు:
219/1 – ఇంగ్లండ్ vs శ్రీలంక (ఎడ్జ్బాస్టన్, 2026)
213/5 – ఇంగ్లండ్ vs పాకిస్థాన్ (కేప్టౌన్, 2023)
209/5 – భారత్ vs నెదర్లాండ్స్ (హెడింగ్లీ, 2026)
195/3 – దక్షిణాఫ్రికా vs థాయ్లాండ్ (2020)
194/5 – భారత్ vs న్యూజిలాండ్ (2018)

