India Playing XI vs Zimbabwe 1st T20: భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు రంగం సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం (జూలై 23) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలో బోల్తాపడ్డ టీమిండియా.. జింబాబ్వేపై గెలవాలని పట్టుదలగా ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈ సిరీస్లో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. సీనియర్ ఆటగాళ్లు సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వడంతో.. యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కనున్నాయి. మొదటి టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
బుడ్డోడికి మరో అవకాశం:
ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ తొలి మూడు టీ20ల్లో నిరాశపరిచాడు. 14, 13, 15 పరుగులతో 42 పరుగులే చేయడంతో చివరి టీ20లో అవకాశం కోల్పోయాడు. జింబాబ్వే సిరీస్కు సంజు శాంసన్ ఎంపికకాకపోవడంతో బుడ్డోడికి జింబాబ్వే సిరీస్లో మరో అవకాశం లభించనుంది. ప్రపంచ నంబర్-2 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. జింబాబ్వే పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో.. ఈసారి తన సహజమైన దూకుడు ఆటను ప్రదర్శించాలని వైభవ్ భావిస్తున్నాడు. అభిషేక్ శర్మకు జింబాబ్వే గడ్డపై మంచి రికార్డు ఉంది. ఇదే వేదికపై టీ20ల్లో అరంగేట్రం చేయడంతో పాటు తన తొలి అంతర్జాతీయ సెంచరీని కూడా నమోదు చేశాడు. దాంతో ఈ ఇద్దరిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మళ్లీ తుది జట్టులోకి రింకూ సింగ్:
మూడో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కు రానుండగా.. నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అయినప్పటికీ.. శ్రేయస్ జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. జింబాబ్వే పర్యటనలో మాత్రం ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడుతాడు. ఫినిషర్ రింకూ సింగ్ మళ్లీ తుది జట్టులోకి అడుగుపెడుతున్నాడు. హార్దిక్ పాండ్యా గాయంతో దూరమవ్వడంతో శివమ్ దూబే ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా బరిలోకి దిగనున్నాడు.
కొత్త బంతిని అందుకోనున్న ప్రిన్స్, మయాంక్:
బౌలింగ్ విభాగంలో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. స్పిన్ విభాగానికి రవి బిష్ణోయ్ నాయకత్వం వహించనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్గా హర్ష్ దూబేకు అవకాశం దక్కనుంది. అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో లేకపోవడంతో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లు కొత్త బంతిని అందుకోనున్నారు. యువ పేసర్ అశోక్ శర్మకు అవకాశం ఇవ్వాలనుకుంటే.. ఇటీవల తేలిపోతున్న శివమ్ దూబే స్థానంలో ఆడించే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి అశోక్ శర్మకు ఛాన్స్ దక్కుతుందో లేదో.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే/అశోక్ శర్మ, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

