ఆఫ్ఘనిస్తాన్తో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ పూర్తిగా ఫిట్గా ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ గురువారం ధృవీకరించారు. ఐపీఎల్ 2026 ముగిసిన కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటంతో ఆటగాళ్ల శారీరక, మానసిక సన్నద్ధతపై కోచ్ కీలక విషయాలు పంచుకున్నారు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్లో సిరాజ్ బౌలింగ్ చేశాడని, అతను చాలా బాగున్నాడని స్పష్టం చేశారు. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వడంతో జట్టులో స్పిన్ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లతో పాటు హర్ష్ దూబే లేదా మానవ్ సుతార్లలో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కవచ్చని ఆయన హింట్ ఇచ్చారు.
గుజరాత్ టైటాన్స్ జట్టు నుండి ఏడుగురు ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఐదు రోజులకే ఈ సుదీర్ఘ ఫార్మాట్కు సిద్ధమవడం ఒక పెద్ద సవాలు అని కోచ్ పేర్కొన్నారు. ఐపీఎల్ రాత్రి వేళల లైఫ్ స్టైల్ నుండి టెస్ట్ క్రికెట్ ఉదయం వేళలకు ఆటగాళ్లను మార్చడానికి వారి ‘స్లీప్ సైకిల్’ (నిద్ర వేళలు) సర్దుబాటు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. ఇందుకోసం స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ ఉదయాన్నే జిమ్ సెషన్లు ప్లాన్ చేశారని తెలిపారు. అలాగే, ఐపీఎల్ టీ20 అలవాట్ల నుండి ఆటగాళ్లను దూరం చేసి, రెడ్ బాల్ క్రికెట్కు అనుగుణంగా మార్చేందుకు ఈ మూడు రోజుల ప్రాక్టీస్ సెషన్లను ఒక ‘డీటాక్స్’ లాగా ఉపయోగించినట్లు చెప్పారు.
ఇక చతేశ్వర్ పుజారా దూరం అయినప్పటి నుండి జట్టులో 3వ బ్యాటింగ్ స్థానం గురించి కూడా ఆయన మాట్లాడారు. డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించిన దేవదత్ పడిక్కల్, అలాగే ఐపీఎల్లో అదరగొట్టిన సాయి సుదర్శన్ ఇద్దరూ మంచి ఫామ్లో ఉన్నారని, ఎవరికి అవకాశం ఇచ్చినా వారికి తగినన్ని అవకాశాలు ఇచ్చి ఆ స్థానంలో స్థిరపడేలా చూస్తామని డోస్కాట్ భరోసా ఇచ్చారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే 34-35 డిగ్రీల ఎండలో టెస్ట్ మ్యాచ్ ఆడటం కష్టమే అయినా.. భారత ఆటగాళ్లు ఈ సవాలును ధీటుగా ఎదుర్కొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
