NTV Telugu Site icon

Thomas Cup: విజేతగా భారత్.. కోనసీమలో మిన్నంటిన సంబరాలు

Thomas Cup Won

Thomas Cup Won

భారత షటిల్ బ్యాడ్మింటన్ టీమ్ ‘థామస్ కప్’ గెలిచి చరిత్ర సృష్టించడంతో.. అమలాపురంలో సంబరాలు మిన్నంటాయి. ఈ విజయం సాధించిన భారత టీమ్‌లో అమలాపురం క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఉండడంతో.. అమలాపురం పట్టణంలో అభిమానులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, విజయోత్సవం నిర్వహించారు.

కాగా.. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో భారత బ్యాడ్మింటన్‌ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత జట్టు.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్‌‌గా నిలిచిన ఇండోనేసియాను 3-0 తేడాతో ఓడించి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్‌లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్‌ను ట్విటర్ మాధ్యమంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇదిలావుండగా.. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్‌, ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించింది. ఆ తరువాతి మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్‌ ఎహసాన్‌, కెవిన్‌ సంజయ సుకముల్జియో జోడీపై విజయం సాధించింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ రెచ్చిపోయి ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ జోనాటన్‌ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో ఓడించి.. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు.