India 8 Gold Medals: ఒకే రోజు 8 స్వర్ణాలు.. రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ సింగ్ రికార్డ్
- కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా
- ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు
- బాక్సింగ్లో భారత బాక్సర్ల దుమ్మురేపే ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India boxing gold medals: 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ శనివారం అదిరిపోయే ప్రదర్శన కనబరిచింది. ఫైనల్స్కు ఒక్క రోజు ముందు భారత బాక్సర్లు, జూడో క్రీడాకారులు, పారా-అథ్లెట్లు అద్భుత ప్రతిభతో దేశానికి పతకాల వర్షం కురిపించారు. ఒకే రోజు ఏకంగా 8 స్వర్ణ పతకాలు సాధించడంతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు.. మొత్తం 39 పతకాలు చేరాయి. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 62 స్వర్ణ పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ 26 స్వర్ణాలు, కెనడా 18 స్వర్ణాలతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
బాక్సింగ్లో భారత బాక్సర్ల దుమ్మురేపే ప్రదర్శన
బాక్సింగ్లో భారత క్రీడాకారులు చరిత్రాత్మక ప్రదర్శన చేశారు. మొత్తం 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు సాధించి భారత్ ఆధిపత్యాన్ని చాటారు. ముఖ్యంగా మహిళా బాక్సర్లు ఏకంగా ఐదు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.
Also Read
- Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
- Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్తో సంబంధం ఏంటి..?
- CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
- IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్తో తలపడనున్న ఇండియా..
స్వర్ణ పతక విజేతలు:
జాస్మిన్ లాంబోరియా – 57 కేజీలు
ప్రీతి పవార్ – 54 కేజీలు
ప్రియా సంగ్వాన్ – 60 కేజీలు
సాక్షి చౌదరి – 51 కేజీలు
అరుంధతి చౌదరి – 70 కేజీలు
సచిన్ శివాచ్ – 60 కేజీలు
అంకుష్ పంఘల్ – 70 కేజీలు
రజత పతక విజేతలు:
లోవ్లినా బోర్గోహైన్ – 75 కేజీలు
జాదుమణి సింగ్ – 55 కేజీలు
నరేంద్ర బెర్వాల్ – +90 కేజీలు
2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్లో భారత్ మూడు స్వర్ణాలతో సహా ఏడు పతకాలు సాధించింది. ఈసారి ఆ రికార్డును మరింత మెరుగుపరుస్తూ భారత బాక్సర్లు సత్తా చాటారు.
జూడోలోనూ భారత క్రీడాకారుల మెరుపులు
జూడోలోనూ భారత్కు మంచి ఫలితాలు లభించాయి. మహిళల 63 కేజీల విభాగంలో ఉన్నతి శర్మ దక్షిణాఫ్రికాకు చెందిన స్కై నాస్టర్ను కేవలం 1 నిమిషం 7 సెకన్లలో ఇప్పోన్ ద్వారా ఓడించి కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో జూడోలో భారత్ సాధించిన పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. అంతకుముందు హర్ష్ సింగ్ పురుషుల 60 కేజీల విభాగంలో, అస్మిత డే మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. యామిని మౌర్య మహిళల 57 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది.
పారా-అథ్లెటిక్స్లో 20 ఏళ్ల నిరీక్షణకు తెర
పారా-అథ్లెటిక్స్లో భారత ఆటగాళ్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. పురుషుల F57 పారా షాట్పుట్లో సోమన్ రాణా 13.40 మీటర్ల త్రోతో స్వర్ణ పతకం సాధించారు. ఇదే ఈవెంట్లో భారత ఆటగాడు శుభమ్ జుయల్ 13.28 మీటర్లతో రజత పతకం గెలుచుకున్నారు. 28 మంది సభ్యులతో కూడిన భారత పారా-అథ్లెటిక్స్ బృందం మొత్తం 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు.. మొత్తం 7 పతకాలు సాధించింది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో పారా-అథ్లెటిక్స్ పతకం కోసం భారత్ ఎదురుచూసిన 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.
గుల్వీర్ సింగ్ మరో చరిత్ర
అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. ఒకే కామన్వెల్త్ క్రీడల ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా గుల్వీర్ నిలిచాడు. అంతకుముందు 10,000 మీటర్ల పరుగులో అతను రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 5000 మీటర్లలో కాంస్యం గెలవడంతో అతని ఖాతాలో రెండు పతకాలు చేరాయి.
ప్రవీణ్ చిత్రవేల్కు రజతం
పురుషుల ట్రిపుల్ జంప్లో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్లతో రజత పతకం సాధించాడు. మరో భారత ఆటగాడు సెల్వ ప్రభు తిరుమరన్ 16.52 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. తన విజయంపై ప్రవీణ్ చిత్రవేల్ మాట్లాడుతూ, 2022 కామన్వెల్త్ క్రీడల్లో కేవలం రెండు సెంటీమీటర్ల తేడాతో పతకం కోల్పోయానని, ఈసారి రజతం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. చలి వాతావరణం కారణంగా తన శరీరం సహకరించకపోయినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించానని తెలిపాడు. తన తండ్రి రైతు, తల్లి గృహిణి అని, తాను సాధించిన విజయాలన్నీ తన కష్టంతో సంపాదించుకున్నవేనని చెప్పాడు. ఇక తన తదుపరి లక్ష్యం ఆసియా క్రీడలేనని వెల్లడించాడు.
తల్లిదండ్రుల కలను నిజం చేసిన సెల్వ ప్రభు
కాంస్య పతకం సాధించిన సెల్వ ప్రభు తిరుమరన్ తన విజయం పట్ల భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లిదండ్రుల కలను నిజం చేయడం గర్వంగా ఉందని చెప్పాడు. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి పతకం సాధించాలన్నది తన తల్లిదండ్రుల చిరకాల కోరిక అని తెలిపాడు. తనకు మద్దతుగా నిలిచిన కోచ్, ఫిజియో, సహచర క్రీడాకారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ పతకాన్ని అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Sunday Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే.!
-
India 8 Gold Medals: ఒకే రోజు 8 స్వర్ణాలు.. రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ సింగ్ రికార్డ్
-
Peru: కూలిన పర్యాటక విమానం.. 13 మంది మృతి.!
-
OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!