India Qualification Scenario: భారీ దెబ్బేసిన వెస్టిండీస్‌.. ఇక సూపర్-8 నుంచే ఇంటికి భారత్?

  • ఉత్కంఠగా మారిన సెమీఫైనల్ రేసు
  • సెమీస్ రేసు ముందంజలో విండీస్
  • మరో గెలుపుతో సెమీస్ చేరాలని చూస్తోన్న దక్షిణాఫ్రికా
  • సూపర్-8 నుంచే ఇంటికి భారత్?
India Qualification Scenario

India Qualification Scenario

టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశలో సెమీఫైనల్ రేసు ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా గ్రూప్-1 రేసు రసవత్తరంగా ఉంది. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన వెస్టిండీస్‌.. సూపర్‌-8లోనూ ఘనంగా బోణీ కొట్టింది. సోమవారం ముంబైలో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో విండీస్ సెమీస్ రేసులో ముందంజలో ఉంది. నెట్ రన్‌రేట్ వెస్టిండీస్‌కు భారీ ప్లస్ కానుంది. భారత్‌పై గెలిచిన దక్షిణాఫ్రికా కూడా మరో గెలుపుతో సెమీస్ చేరాలని చూస్తోంది. విండీస్ భారీ విజయం సాధించడంతో.. సూపర్-8 నుంచే భారత్ నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది.

సూపర్-8 గ్రూప్-1లో ఒక్కో విజయం సాధించిన వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లకు రెండేసి పాయింట్స్ ఉన్నాయి. విండీస్ నెట్ రన్‌రేట్ ఏకంగా 5.350గా ఉండగా.. సఫారీ టీమ్ నెట్ రన్‌రేట్ 3.800గా ఉంది. ఈ రెండు టీమ్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లలో ఒక్క విజయం సాధించినా.. సెమీస్ చేరుతాయి. మరోవైపు ఓ మ్యాచ్ ఓడిన భారత్ నెట్ రన్‌రేట్ -3.800గా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా సెమీస్ చేరాలంటే తన తదుపరి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించడమే కాకుండా.. నెట్ రన్‌రేట్ భారీగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. మైనస్ నుంచి ప్లస్‌కు నెట్ రన్‌రేట్ చేరాలంటే భారీ విజయాలు తప్పవు. అయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ సెమీస్‌కు చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

మొదటి సినారియో: వెస్టిండీస్‌ ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే.. 18 ఓవర్లలో లక్ష్యాన్ని చేధిస్తే దక్షిణాఫ్రికా నెట్ రన్‌రేట్ +2.40కి చేరుతుంది. అదే సమయంలో వెస్టిండీస్ నెట్ రన్‌రేట్ +2.22కు పడిపోతుంది. ఈ పరిస్థితిలో భారత్ సెమీస్ ఆశలు నిలుపుకోవాలంటే భారీ విజయం అవసరం. అంటే జింబాబ్వేపై 250 పరుగులు చేసి కనీసం 150 పరుగుల తేడాతో గెలవాలి. అప్పుడు మాత్రమే రన్‌రేట్ పరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

రెండో సినారియో: దక్షిణాఫ్రికా ముందుగా 200 పరుగులు చేసి.. వెస్టిండీస్ లక్ష్యాన్ని 18 ఓవర్లలో చేధిస్తే పరిస్థితి మారుతుంది. ఈ సందర్భంలో వెస్టిండీస్ నెట్ రన్‌రేట్ +3.28కి, దక్షిణాఫ్రికా నెట్ రన్‌రేట్ +1.50 వద్ద ఉంటుంది. అయినప్పటికీ జింబాబ్వేపై భారత్‌ భారీ స్కోరు చేసి కనీసం 150 పరుగుల తేడాతో గెలవాలి. అలా గెలిస్తే రన్‌రేట్ లెక్కల్లో భారత్ పోటీలో నిలుస్తుంది. అంతేకాదు చివరి సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై కూడా ఇండియా గెలవాల్సిందే. ఆ మ్యాచ్ ఫలితం భారత్ సెమీఫైనల్ ఆశలను తేల్చేస్తుంది. ఇందంతా జరగాలంటే ఏదైనా మిరకిల్ జరగాల్సిందే.