Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్!

  • భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన రోజు
  • ఒకే రోజు బరిలోకి మూడు భారత జట్లు
  • క్రికెట్ అభిమానులకు ట్రిపుల్ ధమాకా
  • 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్
Historical Wednesday In Indian Cricket

Historical Wednesday In Indian Cricket

Historical Wednesday in Indian Cricket: భారత క్రికెట్ చరిత్రలో ఈరోజు (జూన్ 17) ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. క్రికెట్ అభిమానులకు ఉదయం నుంచి రాత్రి వరకు నాన్‌స్టాప్ వినోదం అందించేందుకు మూడు భారత జట్లు మైదానంలోకి దిగుతున్నాయి. ఇండియా-ఎ జట్టు, పురుషుల సీనియర్ జట్టు, భారత మహిళల జట్టు ఒకే రోజు వేర్వేరు టోర్నీల్లో మ్యాచ్‌లు ఆడనున్నాయి. దాదాపు 12 గంటల పాటు వరుసగా క్రికెట్ మ్యాచ్‌లు ఉండటంతో.. ఈ బుధవారం అభిమానులకు అసలైన క్రికెట్ పండగగా మారనుంది.

ఉదయం 10 గంటలకు ఇండియా-ఎ పోరు:

రోజు క్రికెట్ పండగ ఇండియా-ఎ జట్టు మ్యాచ్‌తో మొదలుకానుంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సారథ్యంలో ఇండియా-ఎ జట్టు అఫ్గానిస్థాన్-ఎతో తలపడనుంది. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్.. ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే విజయం తప్పనిసరి. యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునే కీలక అవకాశంగా ఈ మ్యాచ్ నిలవనుంది. అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపై ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో నిరాశపర్చిన బుడ్డోడు.. ఈరోజైనా చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

×
×
Ad

మధ్యాహ్నం 1:30 గంటలకు సీనియర్ టీమ్ సందడి:

మధ్యాహ్నం 1:30 నుంచి భారత సీనియర్ పురుషుల జట్టు రంగంలోకి దిగనుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా అఫ్గానిస్థాన్‌తో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. ఈ పోరులోనూ గెలిచి సిరీస్‌ను ఖాయం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. యువ ఆటగాళ్లతో పాటు సీనియర్స్ కూడా జట్టులో ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాత్రి 7 గంటలకు మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్:

ఇక చివరగా భారత మహిళల జట్టు అభిమానులను అలరించనుంది. మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన హర్మన్‌ సేన.. అదే జోష్‌ను కొనసాగించాలని భావిస్తోంది. సెమీఫైనల్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ మ్యాచ్‌లో విజయం కీలకంగా మారింది.

అభిమానులకు అసలైన క్రికెట్ పండగ:

ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా రాత్రి 10 గంటల వరకు మూడు భారత జట్లు వరుసగా బరిలోకి దిగడం అరుదైన సందర్భం అనే చెప్పాలి. బహుశా ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకే రోజు ఇండియా-ఎ, పురుషుల సీనియర్ జట్టు, మహిళల టీమ్ మ్యాచ్‌లు చూడే అవకాశం రావడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. మొత్తం మీద ఈ బుధవారం భారత క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ ఫీస్ట్‌గా మారనుంది.