Site icon NTV Telugu

IND vs PAK: త్రో బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కొనేందుకు.. సూర్య మాస్టర్ ప్లాన్, ఇక డబిడదిబిడే!

usman tariq suryakumar yadav

usman tariq suryakumar yadav

India Plan to Tackle Usman Tariq’s Unique Bowling: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోరు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో ముందుకు సాగాలని ఇండో-పాక్ జట్లు చూస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ గురించి పెద్ద చర్చ సాగుతోంది.

28 ఏళ్ల ఉస్మాన్ తారిఖ్ తన ప్రత్యేక బౌలింగ్ శైలితో ఇప్పటికే నెట్టింట వార్తల్లో నిలిచాడు. ముఖ్యంగా బంతి డెలివరీ సమయంలో అతను ల్యాండింగ్ ఫుట్‌ను గాల్లో కాసేపు ఆపి ఆలస్యంగా బంతి విసరడం బ్యాటర్లకు గందరగోళం కలిగిస్తోంది. తారిఖ్ యాక్షన్ చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటివరకు నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అతడు సగటు 7.90గా ఉంది. ఇటీవల యూఎస్ఏపై జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 3/27 గణాంకాలతో మెరిశాడు. ఇక టీమిండియాపై ఆడడానికి సిద్దమయ్యాడు. తమ తూరుపుముక్కను భారత్‌పై ప్రయోగించేందుకు పాక్ సిద్దమైంది.

Also Read: Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?

ఉస్మాన్ తారిఖ్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాడు. నెట్ సెషన్లలో స్వయంగా తానే స్పిన్నర్‌గా మారి.. తారిఖ్ శైలిని అనుకరిస్తూ బ్యాటర్లకు బంతులు వేశాడు. తారిఖ్ లాంటి అసాధారణ బౌలర్లను ఎదుర్కోవాలంటే ముందుగానే అలవాటు చేసుకునేందుకు టీమిండియా కొత్తగా ప్రాక్టీస్ చేసింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆ బంతులను ఎదుర్కొన్నారు. సూర్య పక్కనే స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశంలో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ శైలిపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆసక్తికరంగా స్పందించాడు. ‘ఎగ్జామ్‌లో సిలబస్‌కు బయట ప్రశ్న వచ్చినట్టు ఉంటుంది. అలాంటి ప్రశ్నను వదిలేయలేం. దానికి తగిన మార్గం అన్వేషించాలి. మేము కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాం’ అని అన్నాడు. తారిఖ్ భిన్నమైన బౌలర్ అయినా తాము లొంగిపోమని, నెట్స్‌లో చేసిన ప్రాక్టీస్‌ను మ్యాచ్‌లో అమలు చేస్తామని తెలిపాడు. ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకం. పాక్ స్పిన్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటే భారత్‌కు విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. ఈసారి సాంకేతికంగా, వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్న టీమిండియా మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

Exit mobile version