India Lost ODI Series to England: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ముగించింది. ఇప్పటికే టీ20 సిరీస్లో వైట్వాష్కు గురైన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా చేజార్చుకుంది. ఆదివారం (జూలై 19) లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. వరుసగా రెండో సిరీస్ ఓటమితో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 135 బంతుల్లో 141 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ జాకబ్ బెతెల్ 93 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. చివర్లో జో రూట్ 48 బంతుల్లో 74 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఇంగ్లండ్ స్కోరును 387 పరుగులకు చేర్చాడు.
388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పోరాడినా విజయానికి చేరువ కాలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాల మధ్య బరిలోకి దిగిన రోహిత్ శర్మ తన బ్యాట్తోనే గట్టి సమాధానం ఇచ్చాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 138 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్ 77 పరుగులు చేశాడు. తొలి వికెట్కు వీరిద్దరూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్కు శుభారంభం అందించారు. గిల్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ 74 పరుగులతో రోహిత్కు అండగా నిలిచాడు. రోహిత్ కేవలం 84 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసి భారత్ విజయంపై ఆశలు రేకెత్తించాడు.
అయితే మ్యాచ్ కీలక దశలో రోహిత్ శర్మ ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ తడబడింది. చివరి 42 బంతుల్లో 88 పరుగులు అవసరమైన సమయంలో సామ్ కరన్ అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ అయ్యర్ (0)లను పెవిలియన్కు పంపిన కరన్.. అనంతరం కోహ్లీ వికెట్ కూడా పడగొట్టి భారత్ ఆశలను దెబ్బతీశాడు. చివర్లో కేఎల్ రాహుల్ (12), అక్షర్ పటేల్ (2) కూడా త్వరగా ఔటవడంతో భారత్ లక్ష్యానికి 27 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. కరన్ నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ మూడో వన్డేను గెలిచి సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది.

