Vaibhav Sooryavanshi vs Sanju Samson: భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. మరోవైపు వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంపై కూడా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ టెస్టు స్టార్, నయా వాల్ చేతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్కు అవకాశం ఇవ్వాలని చెబుతూనే.. అందుకోసం సంజును జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు.
సంజుపై నమ్మకం కొనసాగించాలి:
జియోస్టార్తో మాట్లాడిన చేతేశ్వర్ పుజారా.. సంజు శాంసన్పై టీమ్ మేనేజ్మెంట్ పూర్తి విశ్వాసం ఉంచాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో సంజు కీలక పాత్ర పోషించాడని, అలాంటి మ్యాచ్ విన్నర్ను ఒక్కసారిగా తప్పించడం సరికాదని పేర్కొన్నాడు. ‘సంజు శాంసన్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ 2026లో తానేంటో నిరూపింకున్నాడు. అతడి ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. సహజమైన ఆట ఆడితే మళ్లీ పరుగులు చేస్తాడు’ అని పుజారా చెప్పాడు.
వైభవ్కు అవకాశం ఇవ్వండి.. కానీ:
వైభవ్ సూర్యవంశీ ప్రతిభ అసాధారణమని పుజారా ప్రశంసించాడు. అతడికి త్వరలోనే భారత జట్టులో అవకాశం రావాలని కోరుకున్నాడు. అయితే ఆ అవకాశం సీనియర్ ఆటగాళ్లను తొలగించడం ద్వారా కాకుండా.. వారికి విశ్రాంతి ఇచ్చి కల్పించాలని సూచించాడు. ‘వైభవ్ ఆడాల్సిందే. కానీ అతడి కోసం సంజు, అభిషేక్ లేదా ఇషాన్ లాంటి టాప్-3 బ్యాటర్లను జట్టు నుంచి తప్పించకూడదు. అవసరమైతే వారిలో ఎవరికైనా విశ్రాంతి ఇచ్చి వైభవ్ను ఆడించాలి. అతడికి ఇంకా 15 ఏళ్లు మాత్రమే, అవకాశం తప్పకుండా వస్తుంది’ అని పుజారా అభిప్రాయపడ్డాడు.
రెండో టీ20లో ఎలాంటి నిర్ణయం?:
ఇప్పుడు అందరి దృష్టి మాంచెస్టర్లో జరిగే రెండో టీ20పై నిలిచింది. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం అవకాశం ఇస్తారా? లేదా ప్రపంచకప్ హీరో సంజు శాంసన్పైనే మరోసారి విశ్వాసం ఉంచుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పుజారా సూచించినట్లుగా సీనియర్లను తప్పించకుండా.. సరైన ప్రణాళికతో వైభవ్కు అవకాశం కల్పిస్తుందా లేదా అనేది గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.
సంజు, వైభవ్కు అవకాశం ఇలా:
చేతేశ్వర్ పుజారా చెప్పినట్లు టాప్ 3 బ్యాటర్లను తప్పించడం లేదా విశ్రాంతి ఇవ్వకుండా.. వైభవ్కు అవకాశం ఇచ్చే మరో మార్గం కూడా ఉంది. వైభవ్ను ఓపెనర్గా పంపి.. సంజును మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఇద్దరు ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, శివమ్ దూబేలలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. మొదటి టీ20లో దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు అక్షర్ ఇటీవలి రోజుల్లో పెద్దగా రాణించడం లేదు. కాబట్టి అక్షర్ను తప్పిస్తే.. సంజు, వైభవ్కు అవకాశం దక్కుతుంది. చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో.

