India Predicted Playing XI for England T20I: ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఘోర పరాజయాలు చూసి పరువు మొత్తం పోగొట్టుకున్న భారత్.. ఇంగ్లండ్తో కీలక టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఐర్లాండ్పై అపజయాలను మరిచి.. ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభం అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. చెస్టర్-లీ-స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగే తొలి టీ20లో భారత్ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్.. ఐర్లాండ్ సిరీస్లో బెంచ్కే పరిమితమైనప్పటికీ ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయినట్లు సమాచారం.
ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్ సంజు శాంసన్ నిరాశపరిచాడు. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతనిపై మరోసారి విశ్వాసం ఉంచిందట. ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20లో కూడా సంజుకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో రాణించి విమర్శలకు సమాధానం చెప్పాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ కొత్త ఓపెనింగ్ జోడితో బరిలోకి దిగనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడనునట్లు తెలుస్తోంది.
ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడనున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, కీపర్ సంజు శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్రౌండర్లుగా శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. ఏకైక స్పిన్నర్గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేగం, స్పిన్ సమతుల్యతతో భారత జట్టు కూర్పును సిద్ధం చేసింది. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన సూర్యాన్ష్ షెడ్గే తుది జట్టులో చోటు కోల్పోనున్నాడు.
ఇంగ్లండ్తో తొలి టీ20లో భారత తుది జట్టు:
వైభవ్ సూర్యవంశీ
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
సంజు శాంసన్ (కీపర్)
శివమ్ దూబే
అక్షర్ పటేల్
హర్షిత్ రాణా
ప్రిన్స్ యాదవ్
అర్ష్దీప్ సింగ్
రవి బిష్ణోయ్

