నివారం చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రసిద్ధ్ తన పదునైన బౌలింగ్తో కోలుకోలేని దెబ్బ తీశాడు. పవర్ప్లేలోనే వరుసగా ఐదు ఓవర్ల స్పెల్ వేసిన అతడు, ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. వన్డే కెరీర్లో ప్రసిద్ధ్ కృష్ణకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత బౌలర్లు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ప్రసిద్ధ్ కృష్ణ తాను వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే ప్రమాదకర ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (5)ను అవుట్ చేసి భారత్కు తొలి బ్రేక్థ్రూ ఇచ్చాడు. ఆ తర్వాత తన మూడో ఓవర్లో రహ్మత్ షా (5)ను, నాలుగో ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ (11)ను పెవిలియన్ చేర్చాడు. ఇక ఐదో ఓవర్లో డార్విష్ రసూలీ (1) వికెట్ కూడా పడగొట్టి పవర్ప్లే ముగిసేసరికే 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రసిద్ధ్ ధాటికి ఆఫ్ఘనిస్తాన్ పవర్ప్లే ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో ఎండ్లో గుర్నూర్ బ్రార్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ వికెట్లు దక్కలేదు. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులో నిలదొక్కుకోవడంతో 19.1 ఓవర్లలో ఆఫ్ఘన్ స్కోరు 99/4 కి చేరింది.
గత వన్డే మ్యాచ్లో విపరీతమైన వేడి కారణంగా ఇబ్బంది పడ్డామని, ఈ మ్యాచ్లోనూ వాతావరణం అలాగే ఉందని టాస్ సమయంలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి పునరాగమనం చేశారు.

