Site icon NTV Telugu

Cricket: పాకిస్థాన్‌కు ఐసీసీ షాక్.. పిచ్‌కు డీమెరిట్ పాయింట్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగిన రావల్పిండి పిచ్‌కు ఐసీసీ బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఐదేళ్లలో 5 డీమెరిట్ పాయింట్లు వస్తే 12 నెలల పాటు ఆ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు వీల్లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఆడిన తొలి టెస్టులో పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలించింది. దీంతో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ నాలుగు సెంచరీలు బాదేశారు. అటు ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 476/4 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్‌లో 252/0 స్కోర్లు చేయగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకు ఆలౌటైంది. మొత్తంగా ఈ టెస్టులో ఐదు రోజుల పాటు 379 ఓవర్లు వేయగా 14 వికెట్లు మాత్రమే నేలకూలాయి.

మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంపై కనేరియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెత్త పిచ్ కారణంగానే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిందన్నాడు. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు ఆస్ట్రేలియాకు రాగా.. మంచి పిచ్‌ను తయారు చేయడంలో పీసీబీ విఫలమైందని విమర్శించాడు. పనికిమాలిన పిచ్‌ తయారు చేయించిందే గాక.. ఇంకా దాన్ని సమర్థించుకోవడం ఏంటని రమీజ్ రాజాను నిలదీశాడు. ఇది ఎలాంటి పిచ్‌ అంటే రమీజ్‌ రాజా ఈ వయసులో ఆడినా కూడా అక్కడ పరుగుల వరద పారించగలడు అంటూ కనేరియా ఎద్దేవా చేశాడు.

Exit mobile version