Harshit Rana Out From IND vs AFG T20 Series: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కు ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్లో ఆడే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లు ఢిల్లీలో జరగనున్నాయి. ఫిట్నెస్కు లోబడి హర్షిత్ రాణాను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకోలేదని సమాచారం.
ఇంగ్లండ్ పర్యటనలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హర్షిత్ రాణా.. అప్పటినుంచి హ్యామ్స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నాడు. అంతకుముందు కూడా హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా కొంతకాలంగా అతడు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ‘హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి హర్షిత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడికి మరికొంత సమయం పడుతుంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆసియా గేమ్స్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టులోనూ రాణాకు చోటు దక్కిన విషయం తెలిసిందే. వరుస గాయాలు, పెద్దగా ఫామ్ లేకున్నా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండతో వరుసగా టీమిండియాలోకి చోటు దక్కించుకుంటున్నాడు.
మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై కూడా కీలక అప్డేట్ వచ్చింది. మోకాలి గాయంతో బుమ్రా గత జూలై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అఫ్గానిస్థాన్ సిరీస్ కోసం బుమ్రాను కూడా ఫిట్నెస్కు లోబడి సెలెక్టర్లు జట్టులోకి ఎంపిక చేశారు. ప్రస్తుతం బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించాడని, తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్దమయ్యాడట. నితీశ్ రెడ్డి ప్రస్తుతం క్వాడ్రిసెప్స్ గాయంతో బాధపడుతున్నాడు. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు అంటూ ఫాన్స్ మండిపడుతున్నారు.
స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. హ్యామ్స్ట్రింగ్ గాయంకు గురైన సుందర్.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు అందుబాటులో ఉన్నాడు. అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ అనంతరం సెప్టెంబర్ 22న టోక్యోలో జపాన్తో భారత్ ఒక మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి ఆసియా క్రీడల్లో భారత జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే కీలక ఆటగాళ్ల ఫిట్నెస్పై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

